గాలి జనార్ధనరెడ్డికి మళ్లీ కష్టాలు తప్పవా…
దేశంలోని ఆడంబరమైన వివాహాలలో ఒకటిదిగా పేరొందేలా కుమార్తె పెళ్లి చేసిన గనుల అక్రమార్కుడు గాలి జనార్దనరెడ్డికి కష్టాలు ఆరంభమయ్యాయి. ఇప్పటికే ఆదాయపన్నుశాఖ అధికారులు పెళ్ళి ఖర్చుల వివరాలను తెలుసుకునేందుకు విచారణలు జరిపారు. తాజాగా గాలికి సంబంధించిన పెద్దనోట్ల మార్పులో కీలకుడిగా వ్యవహరించిన భూ విస్తరణాధికారి భీమానాయక్ డ్రైవర్ రమేశగౌడ ఆత్మహత్యతో కొత్త సంకటం వచ్చి పడింది. భీమా నాయక్పై మద్దూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలకు హాజరు కావాలని ఆయన నివాసానికి మండ్య జిల్లా పోలీసులు నోటీసు పంపారు. భీమానాయక్కు, గాలి జనార్దనరెడ్డికి ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారణలకు తెర లేస్తున్నాయి.
‘గాలి’ మంత్రిగా కొనసాగినప్పుడు భీమానాయక్ బళ్ళారి తహసీల్దార్గా వ్యవహరించి గనుల అక్రమాలకు సహకరించి ఆప్తుడనే పేరు పొందారు. జాగనూరు ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా రైతులు 2009 ఫిబ్రవరి 15న జరిపిన నిరసనలో లాఠీ చార్జ్ జరిపేందుకు భీమా నాయక్ కారకుడైన విషయం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. బళ్ళారి మరియమ్మనహళ్ళి తాండాకు చెందిన భీమా నాయక్ స్థిర, చరాస్తులు సోదరి భర్తతోపాటు పలువురి బంధువుల పేరిట చేసినట్లు తెలుస్తోంది. ఈ కోణంలో గాలిని మరోసారి విచారించే అవకాశం ఉంది.