తమిళనాడు సీఎం జయలలిత ఇకలేరు

తమిళనాడు ముఖ్యమంత్రి.. పురచ్చితలైవి జయలలిత (68) ఇక లేరు.  కోట్లాది అభిమానులను.. పార్టీ కార్యకర్తలను శోకసంద్రంలో ముంచుతూ మరలిరాని లోకాలకు తరలిపోయారు. ఈ మేరకు అపోలో ఆసుపత్రి అధికారిక ప్రకటన వెలువరించింది. తీవ్ర జ్వరం డీహైడ్రేషన్ తో సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత అప్పటి నుంచి సోమవారం వరకు ఆమె ఆరోగ్యం పలు రకాలుగా మారుతూ వచ్చింది. ఒక సమయంలో పూర్తి అచేతనంగా మారిన జయలలిత మధ్యలో లేచి కూర్చున్నారని అన్నం తిన్నారని కాలర్ మైకు సాయంతో కొద్దిసేపు మాట్లాడారని కూడా చెప్పారు. ఇక ఆమె ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంటికి పంపేస్తామని కూడా తెలిపారు. అయితే ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో ఒక్కసారిగా అన్నివర్గాల్లో మళ్లీ తీవ్ర ఆందోళన నెలకొంది. సోమవారం ఉదయం కూడా జయలలితకు గుండె ఆపరేషన్ చేసి వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తమిళ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జయ కన్నుమూతతో యావత్ దేశం శోక సముద్రంలో మునిగింది. అమ్మగా అండగా ఉంటూ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పేదవాడి కంటనీరును తుడిచిన ఆమె లేవన్న వార్తను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.

జయలలిత తమిళనాడుకు ముఖ్యమంత్రి అయినప్పటికీ తెలుగువారికి ఎంతో సుపరిచితురాలు.  ప్రజల హృదయాల్లో స్థానమేర్పరచుకున్న జయలలిత అప్పటి మైసూర్ రాష్ట్రం(ప్రస్తుతం కర్ణాటక))లోని మాండ్యా జిల్లా పాండవపురా తాలూకా మెలుకోట్ గ్రామంలో 1948 ఫిబ్రవరి 24న  జన్మించారు. జయలలిత తమిళ ఆయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జయరామ్ – వేదవల్లిలకు జన్మించారు. అరుదైన వ్యక్తిత్వంతో ప్రజల అభిమానాన్ని పొంది తమిళనాడు ముఖ్యమంత్రిగానూ ప్రజాదరణ పథకాలతో పేదల మనసు దోచుకున్నారు. తమిళనాడుకు రెండవ మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన జయలలిత ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో కొద్దికాలం జైలు జీవితం అనుభవించారు. ఇదే కారణంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. అయితే ఆ సమయంలో తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వంకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు.

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి…

రాజకీయాల్లోకి రావడానికి ముందు జయలలిత సినిమా నటిగా గుర్తింపు పొందారు. 1961నుంచి 180 మధ్య కాలంలో ఆమె 140 తమిళ – తెలుగు – కన్నడ చిత్రాల్లో నటించారు. సినిమా నటిగా ఆమె ఎంజి రామచంద్రన్ తో పలు చిత్రాల్లో నటించారు. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె) స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఎంజి రామచంద్రన్ జయలలితను రాజకీయాల్లోకి తీసుకువచ్చారనే వాదన ఉన్నా ఆమె మాత్రం అనంతర కాలంలో తాను స్వయంగా రాజకీయాల్లో వచ్చానని చెబుతుండేవారు.

1984నుంచి 89 మధ్య కాలంలో ఆమె తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. ఎంజిఆర్ మరణించిన తరువాత ఆమె తనను తాను ఎంజిఆర్కు రాజకీయ వారసురాలిగా ప్రకటించుకున్నారు. ఎంజిఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ తరువాత తమిళనాడుకు రెండవ మహిళా ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన వ్యక్తిగా జయలలిత నేరారోపణలు ఎదుర్కొని జైలు జీవితం గడిపిన జయలలిత 2014లో ఈ కారణంగానే ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. అయితే ఈ కేసును కర్ణాటక హైకోర్టు 2015లో కొట్టవేసింది. దీనితో ఆమె తిరిగి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *