జయలలిత జయంతి రోజైన ఫిబ్రవరి 24న…
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 72వ జయంతి సందర్భంగా కొత్తగా జన్మించిన శిశువులకు రాష్ట్ర మంత్రి డి. జయకుమార్ బంగారు ఉంగరాలు పంచిపెట్టారు. రోయపురం ఆర్ఎస్ఆర్ఎం ప్రభుత్వ ఆస్పత్రిలో ఇవాళ ఆయన ఉంగరాలు బహుమతిగా ఇచ్చారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున జయలలితకు నివాళులర్పించారు. ఆమెకు నివాళిగా ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ. పన్నీర్సెల్వం రాష్ట్ర సచివాలయం వద్ద మొక్కలు నాటారు. కాగా జయలలిత జయంతి రోజైన ఫిబ్రవరి 24ను మహిళలు, చిన్నారుల భద్రతా దినోత్సవంగా నిర్వహిస్తామంటూ పళనిస్వామి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో పాటు ఆమెను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. మరోవైపు జయలలిత జయంతి సందర్భంగా తమ కార్యకర్తలంతా పేదలకు సాయం చేయడంతో పాటు, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అన్నాడీఎంకే పార్టీ పిలుపునిచ్చింది.