బయట పడుతున్న శిఖా చౌదరి నిజస్వరూపం… బీరువా తాళాల కోసం గొడవ!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పారిశ్రామిక వేత్త, ఎక్స్ప్రెస్ టీవీ యజమాని జయరాం హత్య కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి. తాజాగా జయరాం భార్య పద్మశ్రీ ఓ ఛానల్ తో మాట్లాడుతూ 2015 నుంచే తన భర్తకు ఇబ్బందులు మొదలయ్యాయని తెలిపారు. మొదటి భార్య నుంచి ఎలాంటి ఇబ్బందులు రాలేదని, తన భర్త బంధువుల నుంచే ప్రమాదం ఉందని తెలిపారు. శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్ అని, ఎక్స్ప్రెస్ టీవీలో జాయినైన తర్వాత కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని, అందుకే టీవీ ఛానల్ నుంచి ఆమెను తప్పించారని పద్మశ్రీ మీడియాకు తెలిపారు.
జయరాం 30వ తేదీన తన ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత 31వ తేదీన శిఖా చౌదరి ఆయన ఇంటికి వెళ్లింది. బీరువా తాళాలు ఇవ్వాలని వాచ్మెన్ తో గొడవకు దిగింది. ఆ సమయంలో శిఖా అక్కడికి ఎందుకు వెళ్లింది అనేది మిస్టరీగా మారడంతో పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.శిఖా చౌదరి బీరువా తాళాల కోసం గొడవ చేయడంతో… ఆ బీరువాలో ఏమున్నాయి? అనేది చర్చనీయాంవం అయింది. ఈ అంశాలపైనే పోలీసులు ఆమెను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెను ఎక్కడ విచారిస్తున్న విషయం రహస్యంగా ఉంచారు.
జనవరి 30వ తేదీన జయరాం తన ఇంటి నుంచి బయల్దేరి వచ్చారు. 31 గంటల తర్వాత ఆయన మృతదేహం నందిగామ వద్ద బయటపడింది. ఈ 31 గంటల్లో ఏం జరిగింది? ఈ హత్యలో ఎవరెవరి పాత్ర ఉంది అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
జయరాం సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్లోని దసపల్లా హోటల్లో చాలా సేపు ఓ గదిలో ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత జూబ్లీ హిల్స్లోని వివాహ భోజనంబు హోటల్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆయన ఎవరిని కలిశారు అనే అంశాలను పోలీసులు ట్రేస్ చేస్తున్నారు.
జయరాంను హైదరాబాద్ లోనే హత్య చేసి కారులో నందిగామ తరలించి అక్కడ వదిలేసినట్లు తెలుస్తోంది. జయరాం హత్య హైదరాబాద్ లో జరిగింది కాబట్టే ఇక్కడకు కేసు బదిలీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే పోలీసులు ఈ కేసుకు సంబందించిన వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని అంటున్నారు. తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, చాలా మందిని విచారిస్తున్నట్లు తెలిపారు. అందులో శిఖా చౌదరి ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు అన్నారు.