అజ్ఞాతవాసికి లీగల్ నోటీసులు ..!
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం అజ్ఞాతవాసి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించగా, బాక్సాఫీస్ వద్ద తేలిపోయిందని అంటున్నారు. ఫ్రెంచ్ మూవీ ‘లార్గో వించ్’ చిత్రానికి అజ్ఞాతవాసి కాపీ అని పలు వార్తలు రాగా, ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు జెరోమ్ సాలీ తన ట్విట్టర్ ద్వారా కన్ఫాం చేసిన సంగతి తెలిసిందే. అయితే కాపీ వివాదం అజ్ఞాతవాసి చిత్ర నిర్మాతలకి కొత్త చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్నాయి. లార్గోవించ్ భారతీయ రీమేక్ హక్కులను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టీ-సిరీస్ కంపెనీ కలిగి ఉంది. ఆరోపణల నేపధ్యంలో టీ సిరీస్ ప్రతినిధులు అజ్ఞాతవాసి చిత్రనిర్మాతలతో సెటిల్మెంట్ చేసుకున్నారనే కథనాలు వినిపించాయి. దీనిపై జెరోమ్ తన ట్విట్టర్లో కేవలం టీ సిరీస్ తో సెటిల్ చేసుకుంటే సరిపోదేమో? అంటూ మరో ట్వీట్ చేసి నిర్మాతలకి షాక్ ఇచ్చాడు
లార్గోవించ్ దర్శకుడు జెరోమ్ కాపీ వివాదంపై పలు సంకేతాలు ఇస్తున్నప్పటికి, చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో ఆయన లీగల్ నోటీసులకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తన తాజా ట్వీట్ ద్వారా అర్ధమవుతుంది. ‘వారం గడిచినా అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ మౌనంగా ఉండటం బాగోలేదు. ఇక చర్యలు తీసుకునే సమయం వచ్చింది. మిగిలింది లీగల్ నోటీసులు పంపటం ’ అంటూ ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో అజ్ఞాతవాసికి న్యాయపరంగా మరో ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తుంది. ఒకవైపు బాక్సాఫీస్ దగ్గర డీలా పడ్డ ఈ చిత్రంకి మరో కొత్త సమస్య తలెత్తడం నిర్మాతలని సందిగ్ధంలో పడేలా చేసింది. మరి ఈ సమస్యని దర్శకనిర్మాతలు ఏ విధంగా సాల్వ్ చేసుకుంటారో చూడాలి.