విమానం హైజాక్..మోడీకి ట్వీట్..హైడ్రామా
మోడీ సర్.. నేను మూడు గంటలుగా జెట్ ఎయిర్ వేస్ ఫ్లైట్ లో ఉన్నాను. విమానాన్ని ఎవరో హైజాక్ చేసినట్లున్నారు. ప్లీజ్ సాయం చేయండి..“ ఇదీ ముంబై నుంచి ఢిల్లీ వెళ్లే జెట్ ఎయిర్ వేస్ విమానంలో ప్రయాణిస్తున్న నితిన్ అనే ప్రయాణికుడు ప్రధాని మోడీకి చేసిన ట్వీట్. ఇది కాస్తా హైడ్రామాకు కారణమైంది. ఢిల్లీలో వాతావరణం అనుకూలించక ఆ విమానాన్ని జైపూర్ కు మళ్లించడం గందరగోళానికి తావిచ్చింది. మూడు గంటలుగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆ ప్రయాణికుడు.. ఏకంగా మోడీకే హైజాక్ ట్వీట్ చేశారు.
ఈ పరిణామంలో ఉలిక్కి పడిన జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది.. “ఢిల్లీలో వాతావరణం సరిగా లేక మా విమానం 9డబ్ల్యూ 355 ఆలస్యమైంది అంతే“ అంటూ నితిన్ కు ట్వీట్ చేశారు. ఈ విమానంలో 176 మంది ఉన్నారు. అయితే ఈ సమాధానంతో నితిన్ సంతృప్తి చెందలేదు. “ముంబై నుంచి ఢిల్లీ వెళ్లే మిగతా విమానాలకు క్లియరెన్స్ ఇచ్చారు కదా.. మీ వాదనకు ఆధారం ఏదైనా ఉందా?“ అంటూ అతను మరో ట్వీట్ చేశాడు. దీంతో అతన్ని జైపూర్ ఎయిర్ పోర్ట్ లోనే దించి ప్రశ్నించారు భద్రతా సిబ్బంది. ఆ తర్వాత అతనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న విషయం మాత్రం చెప్పలేదు. ఢిల్లీలో వాతావరణం సరిగా లేక ఇలాగే రెండు – మూడు విమానాలు జైపూర్ కు వచ్చినట్లు ఆ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ బన్సల్ వెల్లడించారు.