ఎన్టీఆర్ 27వ చిత్రం టైటిల్… ‘జై లవ కుశ’!
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న 27వ చిత్రానికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘జై లవ కుశ’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు టాక్. చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ వారు ఈ నెల మొదటి వారంలో ‘జై లవ కుశ’ టైటిల్ రిజిస్టర్ చేయించడంతో ఈ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టులో రిలీజ్ అయ్యేలా సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపిస్తారని టాక్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈచిత్రానికి బాలీవుడ్లో 3 ఇడియట్స్, పికె, మోహంజోదారో లాంటి భారీ చిత్రాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ సికె మురళీధరన్ పనిచేయబోతున్నారు.
రవితేజ తో ‘పవర్’, పవన్ కళ్యాణ్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాలను తరకెక్కించిన కెఎస్ రవీంద్ర ఈచిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. త్వరలో నటీనటుల వివరాలు ప్రకటించబోతున్నారు. ఇప్పటికే టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాలతో వరుస హిట్లు కొట్టిన ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ పేరుతో సినిమా చేస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి రావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ‘జై లవ కుశ’ టైటిల్ విషయంలో అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.