బాహుబలి 2 ఆడియో.. మెయిన్ గెస్టులు
మరో మూడు రోజుల్లో.. మార్చి 26న.. రామోజీ ఫిలింసిటీలో మాహిష్మతి సామ్రాజ్యం సెట్ పక్కనే.. ఇప్పుడు ”బాహుబలిః ది కంక్లూజన్” ఆడియో లాంచ్ జరుగుతోంది. గతంలో తిరుపతిలో ఆడియోను రిలీజ్ చేసినప్పటికీ.. ఇప్పుడు మాత్రం మనోళ్ళు హైదరాబాద్ నే టార్గెట్ చేశారు. అందుకు కారణం.. ఆ రోజు ఇక్కడికి రానున్న బాలీవుడ్ మీడియాయేనట.
విషయం ఏంటంటే.. బాహుబలి 2 ఆడియో లాంచ్ కు విశిష్ట అతిథిగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వస్తున్నాడు. ఇప్పటికే పార్టు 1 ద్వారా ప్రెజెంటర్ గా తాను కోట్లు గడించానని చెప్పిన కరణ్ జోహార్.. ఇప్పుడు 2వ పార్టును కూడా భారీగానే హిందీలో రిలీజ్ చేస్తున్నాడు. అందుకే తన బాలీవుడ్ మీడియాతో కలసి ఇక్కడ ఆడియో లాంచ్ కు విచ్చేస్తే.. అప్పుడు ఆ హైప్ రేంజే ఇంకోలా ఉంటుంది. కరణ్ తో కలసి ఆయనకు సన్నిహితులైనా కొందరు హీరో హీరోయిన్లు కూడా వచ్చే ఛాన్సుందట.
ఇదంతా బాగానే ఉంది.. టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన సినిమాను తీసి.. టాలీవుడ్ లెజెండ్స్ ఎవ్వరినీ రాజమౌళి ఆడియో లాంచ్ కు పిలవట్లేదు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు.. శోభు యార్లగడ్డ మామగారు కె రాఘవేంద్రరావు.. మాత్రమే ఇక్కడ కరణ్ జోహార్ తరువాత మనకు చీఫ్ గెస్టులు. అది సంగతి.