మోదీపై కేసీఆర్ నమ్మకం అదే !
దేశవ్యాప్తంగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ దూసుకుపోతున్న బీజేపీ… వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలోనూ బలపడేందుకు వ్యూహాలు రచిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మోదీ ఎంతగా బలపడినా తమకు వచ్చే నష్టమేమీ లేదని కేసీఆర్ నమ్మకంగా ఉన్నారని కొందరు టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇందుకు కేసీఆర్ దగ్గర ఓ లాజిక్ కూడా ఉందని ఆయనతో సన్నిహితంగా ఉండే నాయకులు మిగతవారికి చెప్పినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేయకపోయినా… ఎన్నికల తరువాత మాత్రం ఇద్దరి మధ్య అవగాహన కచ్చితంగా ఉంటుందని టీఆర్ఎస్ అధినేత నమ్ముతున్నారట.
తెలంగాణలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి కావడం… దేశంలో బీజేపీకి కూడా కాంగ్రెస్సే రాజకీయ ప్రత్యర్థి కావడం తమకు కలిసొచ్చే అంశమని కేసీఆర్ భావిస్తున్నారట. తెలంగాణలో బీజేపీ నేతలకు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత సీన్ లేదనే విషయం మోదీకి తెలుసని… అందుకే ఆయన వారిని పెద్దగా ఎంకరేజ్ చేయడం లేదని కొందరు ముఖ్యనేతలతో కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. ఈ కారణంగానే తెలంగాణలో తాము అధికారంలోకి రాకపోయినా… కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఉండేందుకు టీఆర్ఎస్ పవర్ లోకి వచ్చినా పర్వాలేదనే ఉద్దేశంతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉందని గులాబీ బాస్ భావిస్తున్నారట. మరి… కేసీఆర్ నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.