కేసీఆర్ స్నేహితుడికి భద్రాద్రి ఆలయ పగ్గాలా?

స్నేహానికి చాలా విలువ ఇస్తారని చెబుతుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి బాగా తెలిసిన వారంతా. స్నేహితులందు మైహోం రామేశ్వరరావు వేరయా అన్న సాగదీత మాట తెలంగాణ రాజకీయ వర్గాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఆయనకు సీఎం కేసీఆర్ ఇచ్చే విలువ.. ప్రాధాన్యత అంతా ఇంతా కాదని చెబుతున్నారు. తనకెంతో సన్నిహితుడైన స్నేహితుడికి తాజాగా ఒక పెద్ద బాధ్యతను అప్పగించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.

వ్యాపారవేత్తగా పేరున్న మైహోం రాజేశ్వరరావుకు మరో కోణం కూడా ఉంది. ఆయన అధ్యాత్మిక కార్యక్రమాల్నిభారీగా నిర్వహిస్తుంటారు. చిన జీయర్ స్వామికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఆయన.. తరచూ పెద్ద పెద్ద అధ్యాత్మిక కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి ఆలయ బాధ్యతల్ని మైహోం రాజేశ్వరరావుకు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ వాదనకు నిజం చేకూరేలా ఇటీవల జీయర్ స్వామితో కలిసి హెలికాఫ్టర్ లో భద్రాద్రికి వెళ్లిన ఆయన.. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకోవటం గమనార్హం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలాన్ని మరింత ఫేమస్ చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతారు. యాదాద్రి మాదిరే భద్రాద్రిని కూడా భారీగా ప్రమోట్ చేయాలని.. కేసీఆర్ భావిస్తున్నారు.

దీనికి మైహోం రామేశ్వరరావు సరైన వ్యక్తిగా సీఎం భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. స్వతహాగా రామభక్తుడైన ఆయనకు భద్రాద్రి పాలకమండలి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే.. ఆయన కూడా పగ్గాలు అందుకునేందుకు సముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

గడిచిన నాలుగేళ్లుగా భద్రాద్రి సీతారామ చంద్రస్వామి ఆలయ పాలకమండలి లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన రెండున్నరేళ్లు దాటినా.. ఇప్పటికి ఆ ఖాళీని భర్తీ చేయని నేపథ్యంలో.. మైహోం రామేశ్వరరావుకు పగ్గాలు అప్పగిస్తే దేవాలయ రూపురేఖలు మార్చేయటంతో పాటు.. మరింత భారీగా ప్రమోట్ చేస్తారన్న మాట వినిపిస్తోంది. మరీ అంచనాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికి నిజం చేస్తారో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *