కేసీఆర్ టార్గెట్ మామూలుగా లేదుగా

టీఆర్ ఎస్ రథసారథి – తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ 2019 అనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారని ఆయన తాజా అడుగులను గమనించిన వారు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండవ దఫా కూడా అధికార పగ్గాలు చేపట్టే దిశగా టీఆర్ ఎస్ ప్రభుత్వం కార్యాచరణతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉండగా ప్రతి కుటుంబానికి లబ్ధి కలిగేలా వ్యూహాత్మకంగా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. తద్వారా రానున్న ఎన్నికలలో సునాయాసంగా తిరిగి అధికార పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం అవుతుందన్నది కేసీఆర్ అంచనాగా చెప్తున్నారు. గడిచిన రెండున్నరేళ్ల పాలనలో దాదాపు 80 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం ఏదో ఓ సంక్షేమ పథకం ద్వారా లబ్ధి చేకూర్చింది. మరో రెండున్నరేళ్ల వ్యవధిలో మిగిలిన 20 లక్షల కుటుంబాలకూ లబ్ధి చేకూర్చాలన్నది కేసీఆర్ యోచన అని సమాచారం.

గత ఏడాది జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాలలో ఆసరా పెన్షన్ల పరిధిలోకి ఒంటరి మహిళలను కూడా చేర్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇప్పటికే దాదాపు 36 లక్షల మంది వృద్ధులు – వితంతువులు – వికలాంగులు – బీడీ కార్మికులు పెన్షన్లు అందుకుంటుండటంతో వీరిలో ఒంటరి మహిళలు కూడా ఉన్నారని విధిగా ఈ పేరిట పెన్షన్లు ఇవ్వడం కుదరదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ తర్వాత రాష్టవ్య్రాప్తంగా ఒంటరి మహిళలు ఎంతమంది ఉంటారని ముఖ్యమంత్రి కలెక్టర్ల ద్వారా ప్రాథమిక నివేదికలు తెప్పించుకున్నారు. దాదాపు రెండున్నర లక్షల మంది ఉంటారని అధికారులనుంచి సమాచారం రావడంతో వారికి నెలకు రూ.వెయ్యి చొప్పున పెన్షన్లు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇలా ఏ అవకాశాన్నీ వదిలిపెట్టకుండా ముఖ్యమంత్రి వరాలు ప్రకటిస్తున్నారు. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 83 లక్షల మూడు వేల కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 10395629 కుటుంబాలు ఉన్నట్టు లెక్క తేలింది. ఆసరా పెన్షన్ల ద్వారా 3592137 మంది పెన్షన్లు అందుకుంటున్నారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయాల చొప్పున పంట రుణాలను మాఫీ చేయడం వల్ల 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఉద్యోగులు – పెన్షనర్లు మొత్తం కలిసి నాలుగు లక్షల మంది ఉన్నారు. వీరికి 43 శాతం ఫిట్ మెట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులు 80 వేల మంది – కాంట్రాక్టు విధానంపై 20 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటికే ప్రభుత్వం వేతనాలు పెంచింది. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ ప్రక్రియను కొనసాగుతోంది. కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ ద్వారా ఎస్సీ – ఎస్టీ – మైనార్టీ – బిసి వర్గాలకు చెందిన లక్ష మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రాథమికంగా అంచనా వేసిన 2.50 లక్షల మంది ఒంటరి మహిళలకు ఇక నుంచి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వచ్చే ఏడాది చివరి నాటికి 2.60 లక్షల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది మరో లక్ష్యం. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు 8 లక్షల మంది ఉన్నారని సమగ్ర కుటుంబ సర్వేలో తేలడంతో వీరిలో కనీసం సగం మంది నాలుగు లక్షల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దఫా నాలుగు లక్షల మందికి ఇళ్లు నిర్మించి ప్రజల విశ్వాసాన్ని పొంది తిరిగి అధికారంలోకి వచ్చాక మిగిలిన 4 లక్షల మందికి ఇళ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలిసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ – ఓవర్ సీస్ స్కాలర్ షిప్స్ – దళిత కుటుంబాలకు మూడు ఎకరాలు – ఎస్సీ – ఎస్టీ యువతకు స్వయం ఉపాధి కల్పన – కొత్త పరిశ్రమలలో ఉద్యోగ – ఉపాధి అవకాశాలు – ఉద్యోగాల భర్తీ వంటి చర్యల ద్వారా కోటి కుటుంబాలకు లబ్ధి చేకూర్చే లక్ష్యానికి చేరుకోగలిగితే రెండవ దఫా కూడా అధికార పగ్గాలు టీఆర్ఎస్కే దక్కుతాయన్న పక్కా ప్రణాళికతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని గులాబీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *