కేసీఆర్ ఇంటికి వచ్చే మాట సరదాకేనట…

ముఖ్యమంత్రి ఎవరైనా ఇంటికి వస్తానని చెప్పటం.. అదీ అసెంబ్లీలో ప్రస్తావించటం.. దీనికి పాత సంప్రదాయాల్ని గుర్తు చేయటం.. లాంటివి చేస్తే ఎవరైనా ఏం చేస్తారు? పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారు. అందులోకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారు.. ఇంటికి భోజనానికి పిలుస్తాను.. అందరం కలిసి భోజనం చేద్దామన్న మాటే కానీ.. తనకు ఫలానా వారింటికి వెళ్లి భోజనం చేయాలని ఉందన్న కోరికను ఇప్పటివరకూ చెప్పింది లేదు.

కామెడీగా చెప్పారా.. సీరియస్ గా చెప్పారా? అన్న విషయాల్ని కాసేపు పక్కన పెడితే.. కేసీఆర్ తన ఇంటికి వస్తానన్న విషయంపై విపక్ష నేత జానారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. తనకు పప్పు పెట్టి.. పులుసు పెట్టినా విపక్ష నేత జానారెడ్డి ఇంటి వస్తానన్న కేసీఆర్ మాటకు.. ‘సీఎం ఇంటికి వస్తే జొన్నన్నం పెడతా. మా ఇంటికి భోజనానికి రావాలనే కోరిక ఉన్నట్లు చెప్పారే కానీ వస్తున్నట్లు చెప్పలేదు. అయినా అది సరదాకు చేసిన వ్యాఖ్య. అందులో రాజకీయం ఉంటుందని అనుకోవటం లేదు’’ అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ తో తాను కలిస్తే కాంగ్రెస్ పార్టీకి లాభమా.. నష్టమా అన్నది సీఎం ఇంటికి వచ్చి కలిసిన తర్వాత విశ్లేషించుకోవచ్చన్న జానారెడ్డి.. కేసీఆర్ చెప్పిన మాటలకు కాస్తంత భిన్నంగా వ్యవహరించారనే చెప్పాలి. ఇదిలా ఉంటే..జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్లి రావాలని ఉందన్న కేసీఆర్ మాటలపై టీ కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో హుందాగా వ్యవహరించటం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతల్ని గౌరవించాలనే సంస్కారం లేని కేసీఆర్.. తనతో భోజనం చేయాలనే ధైర్యం చేయరని వ్యాఖ్యానించటం గమనార్హం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *