మోడీకి.. కేసీఆర్ షాక్ ఇవ్వబోతున్నారట!
ఇన్నాళ్లూ కేంద్రంతో కలుస్తారని.. త్వరలో జరగబోయే ఎన్నికల నాటికి మంచి మిత్రులు కూడా కానున్నారని.. బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయాలపై ఇన్నాల్లు ఇలా ప్రచారం జరిగింది. కానీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తులు.. ఏ సమయంలో ఎలా మారతాయో ఎవరూ ఊహించలేరు. అందుకు తగ్గట్టే.. పార్లమెంట్ లో టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నాయకుడు.. సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు.
వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో.. టీఆర్ఎస్ పార్టీ.. తటస్థంగా ఉండబోతోందన్నారు. తటస్థంగా అంటే.. ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా ఉండడమే అని అంతా అర్థం చేసుకుంటున్నారు. దీంతో.. 10కి పైగా ఎంపీ స్థానాలున్న టీఆర్ఎస్ మద్దతు ఇవ్వకుంటే.. రాష్ట్రపతి ఎన్నికల్లో.. బీజేపీకి ఇబ్బందే అన్న అభిప్రాయం అంతటా వినిపిస్తోంది.
పైగా.. జితేందర్ రెడ్డి ప్రకటనను తెలుసుకున్న వెంటనే.. సీపీఐ నాయకుడు సురవరం ప్రతాపరెడ్డి.. టీఆర్ఎస్ సీనియర్ నేత, కేసీఆర్ కు సన్నిహితుడు అయిన కేకేతో మంతనాలు మొదలెట్టేశారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. త్వరలోనే సీఎం కేసీఆర్ తోనూ ఆయన భేటీ అవబోతున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో.. కాంగ్రెస్ కూడా.. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేను ఒంటరి చేసేందుకు.. జాతీయంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగడుతోంది. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా.. వారికి జతకలిస్తే.. బీజేపీకి ఇబ్బంది తలెత్తినట్టే. అయితే.. ఇంకో అభిప్రాయం ప్రకారం.. మరో వాదన కూడా తెరపైకి వచ్చింది.
తటస్థంగా ఉండాలన్న నిర్ణయం నుంచి టీఆర్ఎస్ వెనక్కు వెళ్లే అవకాశం కూడా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణకు లాభం కలిగించేలా కేంద్రం చర్యలు తీసుకోవడం ఒక ఎత్తయితే.. పార్టీగా టీఆర్ఎస్ కు మేలు కలిగించే చర్యలు కూడా బీజేపీ తీసుకున్నట్టయితే.. ఈ పరిస్థితి మారదన్న గ్యారెంటీ ఏంటన్న వాదన కూడా వినిపిస్తోంది.
చూస్తుంటే.. వచ్చే జూలైలో జరగబోయే ఎన్నికలు.. బీజేపీకి విషమపరీక్షగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.