ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యంగా ప్రణాళికలు తీసుకొస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేసినా ఇంకా ఆ వర్గాల్లో పేదరికం పోలేదన్నారు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో ప్రగతి భవన్లో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో వందశాతం గుణాత్మకమైన మార్పు రావాలన్నారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఇంకా పేదరికం పోలేదని వారి అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాల్సి ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం అందరం కలిసి ఆలోచించి విధానం రూపొందించుకోవాలి. ఆ విధానాన్ని పకడ్బంధీగా అమలు చేసుకోవాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ తీసుకురావడం మంచి పరిణామం అని తెలిపారు. విమర్శలు, ప్రతివిమర్శలు కాకుండా ఎస్సీ, ఎస్టీలకు ఏం అవసరమో ప్రభుత్వం ఏమి చేయాలో నిర్ణయించుకోవాలని కోరారు. మనం తలచుకుంటే తప్పక ఎస్సీ, ఎస్టీల జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పుడున్న చట్టాన్ని బలోపేతం చేద్దామని చట్టంలో పారదర్శక వ్యూహం ఉండాలని తెలిపారు.