రేణిగుంటలో బాల్యమిత్రుడితో కేసీఆర్ ఆసక్తికరం
చిత్తూరు: తిరుమల శ్రీవారికి మొక్కులు తీర్చుకోవడానికై మంగళవారం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తన బాల్యమిత్రుడు కందాటి శంకర్ రెడ్డిని చూసి ఆగారు. ఆ తర్వాత ‘శంకర్ ఎలా ఉన్నావ్’ అంటూ ఆప్యాయంగా పలుకరించారు.
విమనాశ్రయంలో దిగిన అనంతరం ఎవరినీ కలవకుండా నేరుగా వెళ్ళాలని అనుకున్న కేసిఆర్.. నిలబడి కందాటితో ఆప్యాయంగా మాట్లాడటం అందరిని విస్మయానికి గురిచేసింది. అయితే, మరో విశేషం కూడా ఇక్కడ ఉంది. అదేమంటే.. శంకర్ రెడ్డి సుమారు 3వేల మందితో కేసీఆర్కు స్వాగతం పలకడానికి విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు.
అయితే భద్రతా కారణాల దృష్ట్యా సుమారు రెండు వేల మందిని విమానాశ్రయానికి వెళ్ళే మార్గంలోనే ఆపేశారు. మరో 800 మంది మహిళలను పాతవిమానాశ్రయం వద్దే నిలిపేశారు. దీంతో, శంకర్ రెడ్డి మాత్రం విమానాశ్రయం వెలుపలే నిలబడి వేచివున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్.. శంకర్ రెడ్డితో కొంతసేపు మాట్లాడారు., శంకర్ రెడ్డిని కుశలప్రశ్నలు వేశారు. ఆయనతో మాటలు కలిపి నిలబడటం చూసిన తెలంగాణ మంత్రులు, అధికారులు, అక్కడున్న వారు సైతం ఆశ్చర్యపోయారు. శంకర్ రెడ్డి వెంటవున్న కాంగ్రెస్ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవిని కూడా ఆయన ఆప్యాయంగా పలుకరించడం విశేషం.