తెలంగాణలో ఖైదీ నెంబర్ 150 రిలీజ్కు బ్రేక్..!
మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమా మరో 24 గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. రేపు అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శించేందుకు ఎక్కడికక్కడ ఏర్పాట్లు షురూ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ బ్యాడ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఖైదీ నెంబర్ 150 సినిమాను తెలంగాణలో రిలీజ్ కాకుండా ఆపివేయాలన్న ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. చిరంజీవిని సమైక్యవాదిగా ముద్రవేసి వారు ఈ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతోన్న పోస్టుల ప్రకారం చూస్తే వేయిమంది ఉద్యమకారుల మరణానికి కారణమైన తెలంగాణ ద్రోహి చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 ను తెలంగాణలో రిలీజ్ కాకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ఈ ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాకుండా అడ్డుపడి తెలంగాణ ప్రజలను మోసం చేయడంతో పాటు ఉద్యమకారుల మరణానికి కారకుల్లో చిరు కూడా ఒకడైనందున అతడి సినిమాను చీము, రక్తం ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తి థియేటర్లలో చూడవద్దని…ఈ సినిమాను థియేటర్లలో చూసిన వాళ్లు తెలంగాణ ద్రోహులు అని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ప్రచారంపై మెగా ఫ్యాన్స్ కూడా ఫైర్ అవ్వడంతో పాటు కౌంటర్ ఇస్తున్నారు. చిరు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చిందని, తెలంగాణ ఏర్పాటును ఆయన అడ్డుకోలేకపోయారు. మరి, అలాంటప్పుడు తమ హీరో సినిమా రిలీజ్ను ఎందుకు అడ్డుకుంటున్నారని..ఇది సమంజసం కాదని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఏదేమైనా ఖైదీ నెంబర్ 150 సినిమా రిలీజ్ను తెలంగాణలో రిలీజ్ కాకుండా అడ్డుకోవాలన్న ప్రచారం ఇప్పుడు పెద్ద హాట్టాపిక్గా మారింది.