రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న టైటానిక్ లాంటిది: రాజ్ గోపాల్ రెడ్డి
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గత కొన్నాళ్లుగా బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ‘నేను టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. బీజేపీలోకి వెళ్లాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్తా. రాష్ట్రంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరిన తర్వాత క్షేత్ర స్థాయిలో కార్యకర్తల్లోనూ పార్టీ పరిస్థితిపై చర్చ జరుగుతోంది’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల విరామ సమయంలో ఆర్థిక మంత్రి హరీశ్రావును కలసిన అనంతరం లాబీలో ఎదురైన మీడియాతో రాజగోపాల్ పిచ్చాపాటిగా మాట్లాడారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న టైటానిక్ లాంటిది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు రాబోయే రోజుల్లో బీజేపేయే ప్రత్యామ్నాయం. బీజేపీ బలమైన శక్తిగా ఎదిగేందుకు అనుకూల పరిస్థితి కనిపిస్తోంది’ అని అన్నారు.