కేటిఆర్ : తెలంగాణ సంక్షేమ పథకాలు ఎక్కడైనా అమలవుతున్నాయ?
రాష్ట్రంలో నాలుగు సీట్లు గెలిచిన బీజేపీ.. హడావుడి చేస్తున్నదని, ప్రజల్లో సెంటిమెంట్లు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమపథకాలు దేశంలోని ఏ బీజేపీపాలిత రాష్ట్రంలోనైనా అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, కరీంనగర్ అర్బన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు కర్ర రాజశేఖర్ పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో అక్కడి బీజేపీ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు చపాతీ, ఉప్పు పెడుతున్నదని, కానీ ముఖ్యమంత్రి మనుమడు ఏం తింటే పేదవిద్యార్థులు సైతం ఆదే తినాలనే ఉద్దేశంతో పాఠశాలలకు, హాస్టల్స్కు సీఎం కేసీఆర్ సన్నబియ్యం అందిస్తున్నారని చెప్పారు. బీజేపీ ప్రజలకు ఏం చేస్తుందో చెప్పదు. వారి రాష్ట్రాల్లో మన పథకాలను అమలుచేసే ధైర్యం ఉండదు. కానీ ప్రజల్లో సెంటిమెంట్ను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నది అని తీవ్రంగా మండిపడ్డారు