టీఆర్ఎస్ కే విజయం అంటున్న కేటీఆర్
తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పల్లెలు బాగుండాలన్న లక్ష్యంతో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలకు పుష్కలంగా నిధులు ఇచ్చామని చెప్పారు మంత్రి కేటీఆర్. సంక్షేమం, అభివృద్ధి పథకాలే ఏజెండగా ముందుకు పోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా 60 లక్షల మంది గులాబీ సైనికులు ఉన్నారన్నారు. ప్రతిపక్షాల పరిస్థితి ఆడలేక మద్దెల ఓడినట్లుగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేక అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని అన్నారు.