ఢిల్లీలో కేటీఆర్ బిజీబిజీ
రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు మంగళవారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. మధ్యాహ్నం పన్నెండున్నరకు ఢిల్లీ చేరుకున్న మంత్రి రెండున్నర గంటల వ్యవధిలో ముగ్గురు కేంద్రమంత్రులతో భేటీలు జరిపి రాష్ర్టానికి సంబంధించిన వివిధ అంశాలను వారి దృష్టికి తెచ్చారు. ఫలితంగా రెండేండ్లుగా అంబర్పేట ైఫ్లె ఓవర్కు పట్టిన గ్రహణం వీడింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అండర్టేకింగ్ ఉత్తర్వులను జారీ చేశారు. ఉప్పల్-అన్నోజీగూడకు అలైన్మెంట్ అనుమతి ఇచ్చారు. పెండింగ్లో ఉన్న గద్వాల-కొత్తకోట-మంత్రాలయం జాతీయ రహదారిపై స్పష్టమైన హామీ ఇచ్చారు. భేటీలు జరిగిన నిమిషాల వ్యవధిలోనే ఆదేశాలను, అనుమతులను పొందడం గమనార్హం. రక్షణ మంత్రితో జరిగిన సమావేశం రెండు స్కైవేలపై మంగళవారం రాత్రే అధికారులతో సమావేశం జరిపి నిర్ణయం ప్రకటిస్తామనే స్పష్టమైన హామీని సాధించింది. విదేశీ వ్యవహారాల మంత్రితో జరిగిన సమావేశంలో హైదరాబాద్లో సౌదీ కాన్యులేట్ ఏర్పాటుకు సానుకూల స్పందన లభించింది.
అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ అంబర్పేట్ ైఫ్లె ఓవర్ నిర్మాణానికి కేంద్రం రూ. 248.70 కోట్లు ఇచ్చి సహకరించినందుకు నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపానని అన్నారు. ఉప్పల్-వరంగల్ రహదారిపై స్కై వే మార్గాన్ని కేంద్ర ప్రభుత్వమే తన ప్రాజెక్టుగా పరిగణించి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందిగా కోరగా తగిన ప్రతిపాదనలు పంపిస్తే వెంటనే నిర్ణయాన్ని తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్రెడ్డి, బాల్కసుమన్, సీతారాంనాయక్ ప్రతిపాదించిన కొత్తకోట-గద్వాల-రాయచూర్ రహదారి, మల్లంపల్లి-నకిరేకల్ జాతీయ రహదారి, మంచిర్యాల-చంద్రాపూర్ జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు, ప్రాజెక్టు నివేదికను పంపాల్సిందిగా సూచించారని తెలిపారు. ఇక మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ సమీపంలోని జాతీయ రహదారి డిజైన్ లోపం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని తెలుపగా వెంటనే సంబంధిత అధికారులను పిలిచి క్షేత్రస్థాయి పర్యటన జరిపి డిజైన్ను సరిదిద్దాలని ఆదేశించారని తెలిపారు. మంత్రి కేటీఆర్ వెంట టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్రెడ్డి, బాల్కసుమన్, సీతారాంనాయక్, వినోద్కుమార్, కొత్త ప్రభాకర్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బూర నర్సయ్యగౌడ్, బీబీ పాటిల్, మల్లారెడ్డి, పసునూరి దయాకర్ తదితరులు ఉన్నారు.
రక్షణ భూముల్లో స్కై వే..
అనంతరం కేంద్ర రక్షణ మంత్రి అరుణ్జైట్లీని కలిసిన కేటీఆర్ హైదరాబాద్లో నిర్మించ తలపెట్టిన రెండు స్కై వే ల కోసం సుమారు 100 ఎకరాల కంటోన్మెంట్ భూములను భూమికి బదులు భూమి ప్రాతిపదికన కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ గుండా వెళ్లే ఆదిలాబాద్-నాగపూర్ మార్గంలో ప్యాట్నీ సెంటర్ నుంచి కొంపల్లి వరకు ఒక స్కై వే, రామగుండం మార్గంలో జూబ్లీ బస్టాండ్ నుంచి తూంకుంట వరకు మరో స్కై వే కోసం ఆ భూములు అవసరమని కేటీఆర్ వివరించారు. గతంలో మనోహర్ పారికర్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు దీనికి సూత్రరీత్యా అంగీకారం తెలిపారని, ఆ మేరకు ఇపుడు ఒప్పందం కుదుర్చుకుంటే పనులు ప్రారంభించవచ్చని తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి జైట్లీ మంగళవారం రాత్రే దీనిపై సమావేశం నిర్వహించి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే ఏఓసీ దగ్గర గఫ్ రోడ్డు మూసివేతపై కేటీఆర్ చేసిన విజ్ఞప్తిపై సికింద్రాబాద్ ఏఓసీ ఎస్టేట్ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.
సౌదీ కాన్సులేట్ కార్యాలయం..
అనంతరం విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీకే సింగ్ను కలిసిన మంత్రి కేటీఆర్ సౌదీ అరేబియా కాన్సులేట్ కార్యాలయాన్ని హైదరాబాద్లో నెలకొల్పాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ గతంలో సౌదీ అరేబియాను సందర్శించిన సందర్భంగా ఆ దేశ ఉన్నతాధికారులు, ఢిల్లీలోని సౌదీ రాయబారిని కూడాకలిసి సుదీర్ఘంగా చర్చించారని తెలిపారు. కాగా కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం సౌదీ దేశానికి ఉన్నట్లయితే తప్పకుండా హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటు చేయడంపై నిర్ణయం తీసుకుంటామని వీకేసింగ్ హామీ ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు.
అంబర్పేటకు వీడిన గ్రహణం..
హైదరాబాద్ నగరంలోని అంబర్పేట్లో గోల్నాక-రామాంతపూర్ల మధ్య సుమారు ఒకటిన్నర కి.మీ మేర ైఫ్లె ఓవర్కు కేంద్రం రెండేండ్ల క్రితం అనుమతి మంజూరు చేసింది. ఇక్కడ భూ సేకరణకు రూ. 133 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేయగా, వివిధ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, భూసేకరణ సమస్యలు, ైఫ్లె ఓవర్ డిజైన్పై పిటిషన్ల తో భూసేకరణ వ్యయం రూ. 220 కోట్లకు చేరి కొంత సందిగ్ధత ఏర్పడింది. అయితే అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ నుంచి లేదా ఇతర మార్గాల నుంచి సమకూర్చుకుంటుందని మంత్రి కేటీఆర్ నితిన్ గడ్కరీకి తెలిపారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రమంత్రి అప్పటికప్పుడే అధికారులను పిలిచి అండర్ టేకింగ్ అదేశాలను జారీ చేశారు. అవి మరో రెండు రోజుల్లో రాష్ర్టానికి అందనున్నాయి.
మెట్రో రైల్లో కేటీఆర్ ప్రయాణం
ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ మంగళవారం ఢిల్లీలో పలువురు ఎంపీలు, అధికారులతో కలిసి ఢిల్లీమెట్రోలో ప్రయాణించారు. కేంద్ర మంత్రులను కలవడానికి ఢిల్లీ వచ్చిన ఆయన ఢిల్లీ మెట్రోరైల్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోడానికి, సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో గమనించడానికి మెట్రో బాట పట్టారు. ఆయనతోపాటు ఎంపీలు బాల్క సుమన్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్కుమార్ తదితరులు కూడా మెట్రోరైలులో ప్రయాణించారు. హైదరాబాద్ నగరంలో మెట్రోరైలు త్వరలో పరుగులు పెట్టనున్న నేపథ్యంలో ఢిల్లీ నగరంలో ఈ వ్యవస్థను ఏవిధంగా నిర్వహిస్తున్నారో మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీకి వచ్చే ఎంపీలు, ఉన్నతాధికారులు, రాష్ర్టాల నుంచి వచ్చే ప్రతినిధులు మెట్రో వ్యవస్థను ఏ మేరకు వినియోగించుకుంటున్నారో ఆరాతీశారు.