కేసీఆర్ మనసున్న ముఖ్యమంత్రి: కేటీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ మనసున్న ముఖ్యమంత్రి అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిర్వహించిన టీఆర్ఎస్ జనహిత ప్రగతి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు అవుతోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్ రాజ్యం వస్తుందని కొందరు అన్నారని గుర్తుచేశారు. పేదవారి కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని కేటీఆర్ తెలిపారు. పట్టపగలే 9గంటల నాణ్యమైన విద్యుత్తు అందిస్తోందని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్న పలువురు ఇతర రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని అధికారులను కోరుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా రాష్ట్రంగా నిలిచిందని పునరుద్ఘాటించారు. పేదబిడ్డలు కడుపు నిండా తినాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రభుత్వం వసతి గృహాల్లో సన్నబియ్యం అందిస్తోందన్న కేటీఆర్.. తన పిల్లలు, కవిత పిల్లలు తినే బియ్యాన్ని ప్రస్తుతం వారు తినగలుగుతున్నారని ఆయన అన్నారు.
నిజామాబాద్ జిల్లా దక్షిణ భారత దేశానికి వ్యవసాయంలో పాఠాలు నేర్పిందని.. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్కి అండగా నిలిచిందన్నారు. కేసీఆర్కు ఈ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందని చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద ప్రజల కన్నీళ్లు తుడవడానికి కేసీఆర్ రూ.1000 పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారని.. దీనికోసం ప్రభుత్వం రూ.5300కోట్ల ఖర్చు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ‘అమ్మ ఒడి’ పేరు మీద రూ.12వేలు అందిస్తున్నట్లు తెలిపారు.
‘యూపీలో కొత్త సీఎం ఆదిత్యనాథ్ రూ.36వేల కోట్లు రుణమాఫీ చేసేందుకు తీవ్ర ఆలోచనలు చేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన షీ టీమ్స్ పని తీరు నచ్చడంతో యూపీలో యాంటీ రోమియో స్క్వాడ్స్ ను ప్రవేశపెట్టారని చెప్పారు మంత్రి కేటీఆర్.