శ్రీలంక బౌలర్ మలింగ వన్డే క్రికెట్ కు గుడ్ బై
యార్కర్లు, వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థులను భయపెట్టే శ్రీలంక పేసర్ మలింగ 2011లో టెస్టులకు గుడ్బై చెప్పిన ఇప్పుడు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను టీ20లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. శుక్రవారం కొలంబో వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్ తర్వాత 50 ఓవర్ల ఫార్మెట్కు మలింగ వీడ్కోలు ప్రకటించాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 91 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో మలింగ (9.4-2-38-3) చక్కని స్పెల్తో రాణించాడు. 35 ఏళ్ల మలింగ 226 వన్డేలు ఆడి 338 వికెట్లు పడగొట్టాడు. 2007, 2011 ప్రపంచకప్లో శ్రీలంక ఫైనల్కు చేరడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్లో మలింగ 13 వికెట్లు పడగొట్టి శ్రీలంక తరఫున టాప్ బౌలర్గా నిలిచాడు. ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడు మలింగ.
తన 15 ఏళ్ల వన్డే ప్రయాణంలో ఎన్నో రికార్డులను అందుకున్నాడు. వన్డేల్లో మూడు సార్లు హ్యాట్రిక్ సాధించిన ఏకైక ఆటగాడిగా మలింగ రికార్డు సృష్టించాడు. వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన బౌలర్ మలింగ మాత్రమే. ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ అందుకోలేదు. శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ మలింగ (338). శ్రీలంక తరఫున బౌలింగ్లో అత్యధిక స్ట్రైక్రేట్ను కలిగి ఉన్న రెండో బౌలర్ మలింగనే (32.4). అజంతా మెండిస్ తొలి స్థానంలో ఉన్నాడు.