తృటిలో తప్పిన మెట్రో రైలు ప్రమాదం…ఖండించిన మెట్రో ఎండీ
హైదరాబాద్ మెట్రో రైలుకు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. సుమారు 400మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విషయానికి వస్తే .. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో వెళ్లాల్సిన మెట్రో రైలు పొరపాటున మరో ట్రాక్లోకి వెళ్లింది. పొరపాటును గుర్తించిన డ్రైవర్… లక్డీకపూల్ స్టేషన్లో రైలును నిలిపివేశాడు.వెంటనే అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా అరగంటపాటు మెట్రో సేవలను నిలిపివేశారు. అనంతరం ప్రయాణికులను అక్కడ దించి వేసి రైలు వెనక్కి వెళ్లింది. కాగా వ్యతిరేక దిశలో మరో రైలు వచ్చి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం మెట్రో రైలు లక్డీకాపూల్ వద్ద నిలిచిపోయిన విషయం తెలిసిందే.
కాగా మెట్రో రైలు ప్రమాద ఘటనపై మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. రాంగ్ రూట్లో మెట్రో రైలు వెళ్లిన వార్తలను ఆయన ఖండించారు. మరమ్మతుల కోసమే అరగంట పాటు మెట్రో సేవలలో ఇబ్బందులు తలెత్తినట్లు ఓ ప్రకటన చేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ గాలి పీడనం కారణంగా అసెంబ్లీ స్టేషన్ సమీపంలో ట్రాక్పై మెరుపు అరెస్టర్ రాడ్ పడింది. ముందు జాగ్రత్త చర్యగా, ఓవర్ హెడ్ ఎలెక్ట్రికల్ పవర్ స్విచ్ ఆఫ్ చేయబడింది. అలాగే పడిపోయిన రాడ్ తొలగించాం అని తెలిపారు.