యాక్సిడెంట్ చేసి పరారైన ఎమ్మెల్యే…
కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్యాదవ్ ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన హైదరాబాదు- శ్రీశైలం రహదారిపై మహేశ్వరం మండలం పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన జగన్నాథం(40) మండలంలోని తుమ్మలూరు పరిధి భాష్యం స్కూల్ లో మేస్ర్తీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి పని ముగించుకొని స్కూల్ ఆవరణ నుంచి భయటకు వచ్చి రోడ్డు క్రాస్ చేస్తున్న జగన్నాథాన్ని కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
దీనితో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కారును రోడ్డుమీదే వదిలి కారు డ్రైవర్తో పాటు సంఘటనా స్థలం నుంచి పరారుకాగా మృతుడి కుటుంబసభ్యులు రోడ్డుపై బైఠాయించి ప్రమాదానికి కారణమైన ఎమ్మెల్యే జైపాల్యాదవ్పై చట్టరీత్యా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితుని కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించడంతో శ్రీశైలం-హైదరాబాదు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వాహనాలు ఎక్కడికక్కడే నిలిపోయాయి. దీంతో మహేశ్వరం పోలీసులు రంగంలోకి దిగి ధర్నాకు దిగిన వారిని శాంతింపజేసే ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.