మోదీ, నేను ప్రపంచ నాయకులం
మూడు దేశాల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు నాయకులు సంయుక్త ప్రకటన చేశారు. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మోదీ తొలిసారి ఆయనతో భేటీ అవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వైట్హౌస్లో దాదాపు 20 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపిన ఇరువురు నేతలు రక్షణ, ఉగ్రవాదం, ఎనర్జీ రంగాలపై చర్చించినట్లు వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా మంగళవారం రాత్రి ట్రంప్తో కలిసి మోదీ డిన్నర్ చేస్తారని చెప్పారు. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ తొలి అధికారిక డిన్నర్ మోదీదే కావడం విశేషం.
సంయుక్త ప్రకటనలో మోదీ-ట్రంప్ ఇలా..
ట్రంప్:
– ప్రపంచలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధానమంత్రిని వైట్ హౌస్లోకి ఆహ్వానించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.
– అమెరికా, భారతదేశాల రాజ్యాంగాలు రెండు ‘We The People’ అనే మూడు పదాలతో ప్రారంభం అవుతాయి.ప్రధానమంత్రి మోదీకి, నాకు ఈ మూడు పదాలు ఎంత ముఖ్యమైనవో తెలుసు.
– నేటి సమావేశం తర్వాత ఒక్కటే చెప్పగలను. భారత్-అమెరికాల మధ్య అనుబంధం ఇంకెప్పుడు ఇంత బలమైందిగా ఉండబోదని చెబుతున్నాను.
– మోదీ, నేను సోషల్ మీడియాలో ప్రపంచ నాయకులం.
– నేను మోదీకి సెల్యూట్ చేస్తున్నాను. నేను మీకు సెల్యూట్ చేయడానికి లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయి. అందులో భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం కావడం ఒకటి.
– మరో రెండు వారాల్లో వస్తు సేవల పన్నుల(జీఎస్టీ)ను ప్రారంభించబోతున్నారు. మేం కూడా త్వరలో కొత్త పన్ను విధానాన్ని అమలు చేస్తాం.
– అవినీతిపై మీరు పోరాడుతున్నారు. ఓ అభివృద్ధి చెందుతున్న దేశానికి అవినీతి అనేది పెద్ద ప్రబంధకం.
– ఇరు దేశాల్లో ఉద్యోగాల కల్పన కోసం మీతో కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
– వ్యాపారాలను మరింత ప్రోత్సహించేందుకు ఉన్న కొన్ని అడ్డంకులను తొలగిస్తే బావుంటుంది. దీనికి తగిన విధంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను.
– ఆర్థిక రంగంలో సహకారాన్ని విస్తృతం చేసుకునేందుకు మోదీ.. నా కూతురు ఇవాంకను భారత్కు ఆహ్వానించారు.
– ఉగ్రవాదాన్ని పీచమణుద్దాం. మన ఇరు దేశాలు ఉగ్రవాదం వల్ల దెబ్బతిన్నాయి.
– అప్ఘనిస్తాన్లో తమ బలగాలు ఉండేందుకు సహకరిస్తున్న భారతీయులకు నా ధన్యవాదాలు.
– ఉత్తర కొరియా( రెండు మార్లు ఉత్తర కొరియా అంటూ నొక్కి చెప్పారు) రకరకాల సమస్యలను సృష్టిస్తోంది. ఆ దేశ కార్యకలాపాలపై దృష్టి సారించాల్సివుంది.
– అమెరికాకు విచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించింనందుకు మోదీ మీకు థ్యాంక్స్. భారత్, అమెరికాలు ఎల్లప్పుడూ స్నేహహస్తాన్ని చాస్తాయి. ఒకరిని మరొకరు గౌరవించుకుంటాయి.
మోదీ:
– ట్వీట్ల నుంచి మాటల వరకూ ట్రంప్తో నా సమయం స్నేహపూర్వకంగా గడిచింది.
– వైట్ హౌస్లో నాకు లభించిన ఘనస్వాగతానికి హృదయపూర్వక అభినందనలు.
– భారత్ గురించి మీరు చేసిన వ్యాఖ్యలకు ధన్యవాదాలు.
– ఈ రోజు మీరు చాలా సమయం వెచ్చించారు(ట్రంప్ను ఉద్దేశించి). మన ఇద్దరి మధ్య సాగిన సంభాషణలు భారత్-అమెరికాల మధ్య సంబంధాల్లో కీలకం అవుతాయి.
– భారత్, అమెరికాలకు ఒక లక్ష్యంలో సారుప్యత ఉంది. అదే ఎకానమీ. ఆర్థిక పరిపుష్టి కోసం ఇరు దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.