నేను, నా భార్య …‘మా’లో కూడా చిరంజీవి
మా డైరీ ఆవిష్కరణ 2020 కార్యక్రమం గురువారం హైదరాబాద్లోని గ్రాండ్ హయత్ హోటల్లో ఘనంగా జరిగింది.మా డైరీ ని మెగా స్టార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి, రాజశేఖర్ మధ్య చోటు చేసుకున్న పరిణామాలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ కార్యక్రమానికి రాజశేఖర్ దంపతులతో పాటు సినీ పెద్దలు రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, మురళీ మోహన్, రచయిత గోపాలకృష్ణ, వీకే నరేష్ విచ్చేసారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ .. తమిళ చిత్ర పరిశ్రమలోని నడిగర సంఘంలో చోటుచేసుకొంటున్న ఇబ్బందికర పరిస్థితులను ప్రస్తావించారు. ఓ దశలో నడిగర సంఘం అభివృద్దిని, సంక్షేమ పథకాలను చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. వారి స్థాయికి మనం వెళ్లలేమా అనే సందేహం కలిగేదని అన్నారు. కానీ అక్కడ డబ్బు పెరిగిన కొద్ది అక్కడ కూడా వివాదాలు తారాస్థాయికి చేరుకొన్నాయని చిరంజీవి అన్నారు. ఇంకా .. ఇటీవల మా అసోసియేషన్ అభివృద్ధి కోసం కేసీఆర్ను కూడా కలిసానన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ తెలిపారు. ప్రభుత్వాలు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మనమంతా ఐక్యమత్యంతో ఉండాలి. ప్రతీ ఇంటిలో గొడవలు ఉంటాయి. నేను, నా భార్య సురేఖ ప్రతీ రోజు కొట్టుకొంటాం. తిట్టుకొంటాం. బయటకు వెళ్తే చేతిలో చేయి వేసుకొని ముచ్చటగా కనిపిస్తాం. మమల్ని చూస్తే ఆదర్శ దంపతులు అనుకొంటారు. ఇంట్లోకి వెళ్తే చేయి విదిలేసుకొంటాం. కానీ బయటి ప్రపంచానికి ఎవరికీ తెలియవు. ఒక కుటుంబం అంటే ఇలాంటి చిలిపి సంఘటనలు జరుగుతూనే ఉంటాయంటూ చెప్పారు. మా అసోసియేషన్ కూడా ఒక కుటంబం లాంటిదని ఇలాంటి చిలిపి సంఘటనలు ‘మా’ లో కూడా జరుగుతూనే వుంటాయని. ప్రతీ ఇంటిలో గొడవలు జరుగుతూనే వుంటాయని. కానీ అందరూ ఒక కుటుంబంలా కలిసి మెలగాలని ఈ సందర్భంగా చిరంజీవి సభ్యులను కోరారు.