నవయుగ అశోకుడు… కేసీఆర్..ఆర్.నారాయణమూర్తి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రముఖ సినీ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి ప్రశంసల జల్లు కురిపించారు. నాడు అశోకుడు మొక్కలను నాటితే, ఇప్పుడు కేసీఆర్ కోట్లాది మొక్కలను నాటుతున్నారని కితాబిచ్చారు. వనోద్యమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని… ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనేదే కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు.
కోట్ల మొక్కలను నాటుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. మూడోవిడత హరితహారంలో భాగంగా బుధవారం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలో స్థానిక నాయకులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. చెట్లు, అన్నదాతలు లేని ప్రాంతాలు ఎన్నటికీ అభివృద్ధికి నోచుకోలేవన్నారు.
రాజకీయాలు పక్కనబెట్టి అందరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గండిపేట మండలపరిషత్ అధ్యక్షుడు తలారి మల్లేశ్ ముదిరాజ్, వట్టినాగులపల్లి, ఖానాపూర్ సర్పంచ్లు స్వరూపానాగేశ్, ఆర్ నర్సింహ, ఎంపీటీసీ సభ్యులు రామకృష్ణారెడ్డి, వెంకటేశ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు పీ చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.