మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్ టీవీ షోలో ప్రధాని నరేంద్ర మోదీ

డిస్కవరీ ఛానల్ ప్రసారం చేయనున్న మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్ టీవీ షోలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా త్వరలో కనిపించనున్నారు. పర్యావరణ మార్పులు వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ డిస్కవరి ఈ ఎపిసోడ్ రూపొందించింది. ఈ కార్యక్రమంలో సాహసాలు చేస్తూ కనిపించే బేర్ గ్రిల్స్ తో కలిసి మోది కూడా ప్రత్యేక ఎపిసోడ్ లో నటించారు. ఆ షోకు సంబంధించి సోమవారం విడుదలైన ట్రైలర్‌లో ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో  ఆయన సాహసోపేతంగా కలియతిరుగుతున్నారు. ఈ సందర్భంగా మోదీ వెల్లడించిన అభిప్రాయాలను డిస్కవరీ ఛానల్ ఓ ప్రకటనలో విడుదల చేసింది.

‘కొన్ని సంవత్సరాలు పాటు నేను అడవులు, పర్వత ప్రాంతాల్లో నివసించాను. ఆ రోజులు నామీద చెరిగిపోని ముద్రవేశాయి. రాజకీయాలకు దూరంగా, ప్రకృతి మధ్యలో తిరుగుతూ చేసే ఈ కార్యక్రమం గురించి అడిగినప్పుడు నేను చాలా ఆసక్తి ప్రదర్శించాను. దానిలో భాగం కావాలనుకున్నాను. భారత్‌కు చెందిన పర్యావరణ సంపదను ప్రపంచానికి చూపడానికి నా వరకు ఇది గొప్ప అవకాశంగా భావించాను. అలాగే పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని గట్టిగా చెప్పడానికి వేదికగా అవుతుందనుకున్నాను. అడవిలో సమయాన్ని గడపడానికి మరోసారి నాకు సమయం లభించింది’ అని ఆ ప్రకటన పేర్కొంది.
అలాగే ఈ షోపై మోదీ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘దట్టమైన అటవీ ప్రాంతం, వివిధ రకాల వన్యప్రాణులు, అందమైన పర్వత ప్రాంతాలు, పెద్ద పెద్ద నదులు అన్నీ భారత్‌లో కనిపిస్తాయి. ఈ షో చూసిన తరవాత ఆయా ప్రాంతాల్లో పర్యటించాలన్న ఆసక్తిని కలిగిస్తుంది. అలాగే పర్యావరణ పరిరక్షణ మీద మీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు’ అని ట్వీట్ చేశారు.  ఈ ఎపిసోడ్ టీజర్ ను బేర్ గ్రిల్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ, మోదితో కలిసి నటించడం తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఆగస్ట్ 12న 180 దేశాల్లో ప్రసారం కానుంది.

 

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *