ఢిల్లీ నిర్భయ కేసులో సుప్రీం తీర్పు: నలుగురికి ఉరిశిక్ష ఖరారు
దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులకు సుప్రీం కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. గతంలో ఢిల్లీ హైకోర్టు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు శుక్రవారం సమర్థించింది. నిందితుల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ నిర్భయ ఘటనలో నిందితులు బాధితురాలి పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించారని, వారిపై ఎలాంటి సానుభూతి చూపలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో నిర్భయ హత్యాచారం కేసులో దోషులైన ముఖేష్, వినయ్, అక్షయ్, పవన్లకు ఉరిశిక్ష అమలు కానుంది.
కాగా, న్యాయమూర్తులు తీర్పు చదువుతుండగా చప్పట్లతో కోర్టు హాలు మారుమోగింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు పట్ల నిర్భయ తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే. నిందితులు మరోసారి రివ్యూ పిటిషన్ వేసే అవకాశముంది. లేదంటే రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరుతూ విన్నవించుకునే అవకాశం ఉంది. అయితే ఈ దారుణమైన కేసులో మాత్రం రాష్ట్రపతి కూడా వీరికి క్షమాభిక్ష పెట్టే అవకాశం దాదాపు లేదనే చెప్పవచ్చు