నిత్యానంద నూతన స్వతంత్ర దేశం
బెంగళూరు: తనపై నమోదైన లైంగికదాడి కేసును తప్పించుకొనేందుకు పాస్పోర్టు లేకుండా దేశం వదిలి పారిపోయిన నిత్యానంద(nityananda) సెంట్రల్ అమెరికాలో ఈక్వెడార్కు సమీపంలో ఒక రాజ్యాన్ని స్థాపించినట్టు ప్రకటించాడు. దాని పేరు కైలాస అని, తమకు ప్రత్యేక పాస్పోర్టు ఉందని తెలిపాడు. కొత్త దేశం పేరిట వెబ్సైట్ కూడా ప్రారంభించిన నిత్యానంద తమది ఈ ప్రపంచంలోనే గొప్ప హిందూ దేశం అని చెప్పుకున్నాడు. ఈక్వెడార్కు సమీపంలోని ఒక దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద, దానిని నూతన స్వతంత్ర దేశంగా చెప్పుకుంటున్నాడు. తనదేశంలో పౌరసత్వం పొందాలని ఆహ్వానం పలుకుతున్న నిత్యానంద అదే సమయంలో పరిపాలన సాగించేందుకు విరాళాలు కూడా ఇవ్వాలని కోరుతున్నాడు. 2000 సంవత్సరంలో బెంగళూరు సమీపంలో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పిన నిత్యానంద అసలుపేరు రాజశేఖరన్. తమిళనాడుకు చెందిన నిత్యానంద.. 2010లో ఓ సినీ నటితో శృంగార కార్యకలాపాలు సాగిస్తున్న వీడియో బయటకు రావడంతో వార్తల్లోకెక్కాడు. ఆ ఘటనకు సంబంధించి లైంగికదాడి కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అప్పట్లో అరెస్టు చేశారు. అహ్మదాబాద్లోని మరో ఆశ్రమంలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు రావడంతోపాటు, అతనిపై మరో సెక్స్ కుంభకోణం కూడా గత నెలలో బట్టబయలైంది. దీంతో అతడు దేశం వదిలి పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.