కయ్యానికి సై.. దూసుకెళ్లిన అమెరికా యుద్ధవిమానాలు
ఉత్తర కొరియా మరోసారి రెచ్చిపోయింది. అగ్రరాజ్యం అమెరికా సహా పొరుగుదేశాల హెచ్చరికలను లెక్క చేయకుండా రచ్చరచ్చ చేస్తూ వస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా ఆధీనంలో ఉన్న ఓ ద్వీపంపై అణుదాడి చేయడానికి ఉత్తరకొరియా పక్కా ప్రణాళిక రచిస్తున్నట్లు ఆ దేశ అధికారిక మీడియా పేర్కొంది. ఉత్తరకొరియాకు 2,128 మైళ్ల దూరంలో ఉన్న గువాం ద్వీపంపై దాడి చేయన్నట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం ఉత్తరకొరియాపై చేసిన వ్యాఖ్యలే దాడి నిర్ణయానికి కారణమని వెల్లడించింది.
దాడి జరిగితే అడ్డుకునేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని అమెరికన్ ఎయిర్ఫోర్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. అందుకోసమే 10 గంటలపాటు పైలట్లు ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలిపింది. ఉత్తరకొరియా ఆలోచనను ముందుగానే పసిగట్టిన అగ్రరాజ్యం ప్రత్యర్థిని తోకముడిచేలా చేయాలనే వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రపంచంలో ఇంతకుముందెన్నడూ చూడనివిధంగా అమెరికా విశ్వరూపాన్ని యుద్ధంలో ఉత్తరకొరియా చూస్తుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా వ్యూహానికి అద్దంపడుతున్నాయి. ఈ సమావేశం జరిగిన తర్వాతే ట్రంప్ న్యూ జెర్సీలో ఉత్తరకొరియాపై కామెంట్లు చేశారు. కాగా, గువాం గవర్నర్ అమెరికాను యుద్ధంలో గెలుస్తుందని బుధవారం వ్యాఖ్యానించారు. గువాంపై దాడి చేసేందుకు ఉత్తరకొరియా దాదాపు 60 న్యూక్లియర్ వార్ హెడ్లను సిద్ధం చేసిందని అమెరికా అధికారులు భావిస్తున్నారు.