కమీషన్ పద్దతిలో:రూ. 1. 44 కోట్ల కొత్త నోట్లు సీజ్
కోయంబత్తూరు: పాత పెద్ద నోట్లు తీసుకుని కమీషన్ పద్దతిలో ఇతర నోట్లు ఇస్తున్న 18 మందిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 1.44 కోట్లు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. కోవై జిల్లాలోని కునియముత్తూరులో శ్రీక్రిష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్ సమీపంలోని ప్రాంగణంలో పాత రూ.1,000, రూ.500 నోట్లు తీసుకుని ఇతర కరెన్సీ ఇస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఆ ప్రాంతంలో నిఘా వేశారు.
కాలేజ్ సమీపంలోని ప్రాంగణంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 18 మందిని పోలీసులు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి దగ్గర భారీ మొత్తంలో నగదు ఉన్న విషయం గుర్తించారు. వారి దగ్గర ఉన్న రూ. 1.44 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ. 1,000, రూ.500 నోట్లు తీసుకుని కమీషన్ పద్దతిలో వారికి ఇతర నోట్లు ఇస్తున్నారని విచారణలో వెలుగు చూసిందని పోలీసులు చెప్పారు. ఈ కొత్త నోట్ల కమీషన్ దందాలో ఎంత మంది పెద్దలు ఉన్నారు ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. పాత నోట్లు చిక్కక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో వారి అవసరాన్ని వాడుకుకుని భారీ మొత్తంలో కమీషన్ తీసుకుని వారిని మోసం చేస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.