ఒక్క మాటతో బీజేపీ పరువు తీసిన సీఎం
మాటలు చురకత్తులు అన్నది కేసీఆర్ నోటి వెంట వచ్చే మాటల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఆయన మాటల్లో ఉండే పదును అంతా ఇంతా కాదు. సమకాలీన రాజకీయాల్లో ఆయన నోటికి భయపడే నేతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామందే కనిపిస్తారు. తెలంగాణ ఉద్యమ టైంలో అయితే కేసీఆర్ కంటికి తాము కనిపించకూడదని ప్రార్థించుకున్న నేతలు చాలామందే ఉన్నారు.
ఎంతటివాడినైనా సరే.. పూచికపుల్ల సమానంగా తీసేయటమే కాదు.. ఆ మాట అతికినట్లుగా ఉండటమే కాదు.. దశాబ్దాల తరబడి తెచ్చుకున్న ఇజ్జత్ మొత్తాన్ని తీసిపారేసినట్లుగా మాట్లాడేస్తారు. ఎక్కడిదాకా ఎందుకు? తాజాగా బీజేపీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి.
ఇప్పటి రాజకీయాల్లో దూకుడు వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కమలనాథులకే కరెంట్ షాక్ కొట్టే వ్యాఖ్యలు చేయటం కేసీఆర్ కే చెల్లుతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో తమదే అధికారమని గప్పాలు కొట్టుకునే బీజేపీ నేతలకు ముఖం మీద నెత్తురు చుక్క లేని రీతిలో కడిగిపారేశారు కేసీఆర్.
బీజేపీని అసలు పార్టీ కిందనే పరిగణించమని తేల్చేశారు. కమలనాథుల్ని ఒక జోక్ గా తీసుకుంటామన్న ఆయన 2019 ఎన్నికల్లో బీజేపీకి ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాదని తేల్చేశారు. రానున్న రోజుల్లో తమదే రాజ్యాధికారం అనుకుంటున్న బీజేపీ నేతలకు ఇంతకు మించిన అవమానం ఇంకేం ఉంటుంది. తోటి రాజకీయ పార్టీ తమను పార్టీగానే గుర్తించమని చెలరేగిపోవటం బీజేపీ నేతలకు నోట మాట రాకుండా చేసిందని చెప్పక తప్పదు. కేసీఆర్ నోటికి భయపడేది ఇలాంటి మాటలకేనని చెప్పక తప్పదు. తాజా వ్యాఖ్యలతో బీజేపీ నేతల్ని లాగి పెట్టి ఒక్కటిచ్చినట్లుగా మాటలతో తేల్చేశారని చెప్పాలి. మరి.. కేసీఆర్ మాటలకు కమలనాథులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.