పోలీసుల తీరుపై ఒంగోలు ఎస్పీ దృష్టి
స్టేషన్కు వచ్చిన బాధితులతో పోలీసులు ప్రవర్తించే తీరుపై ఫిర్యాదులు తరుచూ అందుతూనే ఉంటున్నాయి. దీనిపై దృష్టి పెట్టిన ఒంగోలు ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. ట్రైనీ ఐపీఎస్ జగదీశ్ను తాలూకా పోలీస్ స్టేషన్కు పంపారు. అతడెవరో పోలీసులు గుర్తు పట్టలేదు. తనది ఈ ఊరు కాదని, తనపై ఎవరో దాడి చేసి మొబైల్ ఫోన్ లాక్కెళ్లిపోయారని ఓ ఫిర్యాదు రాసి రిసెప్షన్లో ఇచ్చారు. దాన్ని కానిస్టేబుళ్లెవరూ పట్టించుకోలేదు. సీఐ వచ్చాక రమ్మంటూ పంపించేశారు. మళ్లీ సాయంత్రం వెళ్లాడు, ఐనా సమాధానం లేదు. పలుసార్లు బతిమిలాడిన తర్వాత రైటర్ వద్దకు పంపారు. రైటర్ని ఎఫ్ఐఆర్ కాపీ కోసం అడగగా.. సీఐ వచ్చాక రమ్మన్నారు. తాను గన్నవరం వెళ్లాలని, కనీసం ఫిర్యాదు చేసిన రసీదయినా ఇవ్వాలని కోరారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు, చివరకు ఎస్సై వద్దకు పంపారు. ఆయన కూడా సమాధానం చెప్పలేదు. తనకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల్సిందేనంటూ గట్టిగా అడిగితే ఆయన పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని ఎస్పీకి చెప్పగా… ఆయన వెంటనే రంగంలోకి దిగి.. తాలూకా స్టేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. రైటర్ను సస్పెండ్ చేశారు. సీఐ, ఎస్సైతో సహా నలుగురికి చార్జి మెమోలు జారీ చేశారు. ఫిర్యాదిదారులపట్ల పోలీసుల ప్రవర్తనపై తనకు తరచూ ఫిర్యాదులు వస్తుండటంతో ఈ విధంగా ట్రైనీ ఐపీఎస్ జగదీశ్ను స్టేషన్కు పంపానని సిద్ధార్థ్ తెలిపారు.