పాక్ ఏంటి నీ వక్రబుద్ధి…మోదీ విమానానికి నో…
మోదీ విమానానికి తమ గగనతలం మీదుగా అనుమతి ఇవ్వడంలేదంటూ పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ బుధవారం ప్రకటించారు. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. మొన్నే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఐర్లాండ్ పర్యటన సందర్భంగా ఆయన విమానానికి పాకిస్తాన్ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. తాజాగా, ప్రధాని అమెరికా పర్యటనకు సైతం తమ గగనతలం మీదుగా అనుమతించబోమని పాక్ స్పష్టం చేసింది. దాయాది నిర్ణయంపై భారత్ తీవ్రంగా మండిపడింది. దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ.. పాక్ నిర్ణయం అంత సబబుగా లేదని వ్యాఖ్యానించారు. వీవీఐపీ విమానాలను పాక్ ఇలా అడ్డుకోవడం రెండు వారాల్లో ఇది రెండోసారని, సాధారణంగా ఏ దేశమైనా అనుమతి మంజూరు చేస్తుందన్నారు. పాక్ నిర్ణయం విచారకరమని రవీశ్ కుమార్ పేర్కొన్నారు.
జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హక్కులు కల్పిస్తోన్న ఆర్టికల్ 370ను భారత్ రద్దుచేయడాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల తలెత్తడంతో తమ గగనతలంలోకి భారత విమానాలకు పాక్ అనుమతి నిరాకరించింది. కొద్ది రోజుల కిందట రాష్ట్రపతి మూడు దేశాల పర్యటన సందర్భంగా కూడా పాక్ అనుమతి ఇవ్వలేదు.