పాక్ లో హిందూ వైద్య విద్యార్ధిని అనుమానాస్పద మృతి
పాకిస్తాన్లోని లర్కానా ప్రాంతంలో హిందూ వైద్య విద్యార్ధిని నమ్రితా చందాని అనుమానాస్పద మృతిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనను నిరసిస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు కరాచీ వీధుల్లో ఆందోళన చేపట్టారు. లర్కానాలోని బబీ అసిఫా డెంటల్ కాలేజీలోని తన హాస్టల్ గదిలో నమ్రితా అనుమానాస్పద స్ధితిలో విగతజీవిగా పడిఉన్నారు. మరోవైపు విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆమె బలవన్మరణానికి పాల్పడలేదని, ఆమెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. లోపలి నుంచి తాళం వేసిన తన గదిలో మంచంపై పడిఉన్న నమిత్రా చందాని మెడకు తాడు బిగించి ఉంది. ఆమె గదికి తాళం వేసి ఉండటంతో సహ విద్యార్ధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాకిస్తాన్లో ఇటీవల మైనారిటీలపై దాడులు పెరుగుతున్న క్రమంలో హిందూ విద్యార్ధిని అనుమానాస్పద మృతి చోటుచేసుకోవడం గమనార్హం.