పళనిస్వామికే పగ్గాలు.. గవర్నర్ ఫిక్స్!, మధ్యాహ్నాం రాజ్ భవన్ ప్రకటన!?
చెన్నై: వారానికి పైగా సాగిన హైడ్రామాలో అక్రమాస్తుల కేసుతో శశికళ చిత్తయిపోగా.. పన్నీర్-పళనిస్వామిల మధ్య డ్రామా ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ఈ డ్రామాకు తెరదించుతూ నేటి మధ్యాహ్నాం గవర్నర్ విద్యాసాగర్ రావు తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశముంది. ఇద్దరిలో ఎవరిని బలనిరూపణకు ఆహ్వానించాలన్న దానిపై ఆయన రాజ్యాంగ నిపుణులతో మంతనాలు జరిపారు.
కాగా, బుధవారం సాయంత్రం అన్నాడీఎంకె శాసనసభాపక్ష నేత పళనిస్వామి, ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలతో గవర్నర్ విద్యాసాగర్ రావు వేర్వేరుగా భేటీ అయ్యారు. 124 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని చెబుతూ, అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత పళనిస్వామి, గవర్నర్ కు లేఖ ఇచ్చారు.
మరోవైపు పన్నీర్ సెల్వం మాత్రం ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించి గవర్నర్ కు ఎలాంటి లేఖ ఇవ్వలేదు. దీంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం పళనిస్వామికే అవకాశం ఇవ్వాలని గవర్నర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు నేటి మధ్యాహ్నాం పళనిస్వామికి రాజ్ భవన్ వర్గాల నుంచి కబురు అందే అవకాశముంది. రాజ్ భవన్ నుంచి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మధ్యాహ్నాం లోగా వెలువడే సంకేతాలు అందుతున్నాయి.