పళనిస్వామి చరిత్ర చూస్తే ఆశ్చర్యపోతున్నారు
అన్నాడీఎంకే పార్టీ రాజకీయాలు క్షణక్షణానికి రక్తి కట్టిస్తున్నాయి. అన్నాడీఎంకే తాజా శాసనసభాపక్ష నేత పళని స్వామి గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. తనకు 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను గవర్నర్కు అందజేశారు. దాదాపు 40 నిమిషాలపాటు గవర్నర్ తో జరిగిన చర్చలో తనకు బల నిరూపణకు అవకాశమివ్వాలని మంత్రి పళని స్వామి కోరారు. పన్నీర్ వ్యూహంతో అలర్టయిన శశికళ కోర్టులో లొంగిపోవడానికి వారం రోజుల సమయం కావాలని అనారోగ్యం కారణంగా ఈ అవకాశం ఇవ్వాలని శశికళ కోర్టులో పిటిషన్ వేశారు. పార్టీపై పట్టు కోల్పోకుండా ఉండేందుకు శశికళ ఎత్తుకు పైఎత్తు వేస్తూ రాజకీయాలను నడిపిస్తున్నారు. ఇందులో భాగంగానే పన్నీరుకు బద్ధ శత్రువు పళని స్వామిని సీఎం క్యాండిడేట్ గా ప్రకటించింది. పళనిని ముందు పెట్టి తెరవెనుక జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపించడానికి శశికళ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మరోవైపు తమిళనాడు సీఎం పీఠంపై ఎక్కేందుకు సర్వం సిద్ధం చేసుకున్న మంత్రి పళనిస్వామి వెనుక ఆసక్తికరమైన చర్చే ఉంది. అన్నాడీఎంకే తమ శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయనపై గత చరిత్రపై ఆసక్తి నెలకొంటుంది. ఇంతకీ ఎవరీ పళని స్వామి అంటే.
– అన్నాడీఎంకే అధినేత్రి – దివంగత తమిళనాడు సీఎం జయలలితకు పన్నీర్ సెల్వం లాగే.. శశికళకు వీర విధేయుడు పళనిస్వామి. ఆయన పేరు ఆమె ప్రతిపాదించడానికి ఇదే అతిపెద్ద అర్హత. తమిళనాడు అసెంబ్లీకి ఐదుసార్లు ఎన్నికయ్యారు. సేలెం జిల్లాలో ఆయనకు పట్టుంది.
– శశికళ – పన్నీర్ సెల్వం దక్షిణ తమిళనాడులోని బలంగా ఉండే తేవర్ సామాజిక వర్గానికి చెందినవారు కాగా.. పళనిస్వామి గౌండర్ సామాజిక వర్గానికి చెందినవారు. పశ్చిమ తమిళనాడులో ఈ సామాజికవర్గానికి మంచి పలుకుబడి ఉంది
– విద్యార్థినేతగా అన్నాడీఎంకేలో చేరారు. తర్వాత పార్టీ – ప్రభుత్వాల్లో ఎన్నో కీలకమైన బాధ్యతలు చేపట్టారు.
– నిజానికి జయలలిత మరణించిన తర్వాత పళనిస్వామినే శశికళ సీఎం చేయాలని అనుకున్నా.. చివరి నిమిషంలో పన్నీరుసెల్వం వైపు మొగ్గు చూపారు.