పంత్, శ్రేయస్ ఒకేసారి….
అంతర్జాతీయ క్రికెట్లో ఒకేసారి ఇద్దరు క్రికెటర్లు బ్యాటింగ్కు వచ్చారంటే అది ఓపెనర్ల విషయంలోనే మనం చూస్తాం. అయితే టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడో టీ20లో రెండో వికెట్గా శిఖర్ ధావన్ ఔటైన తర్వాత రిషభ్ పంత్-శ్రేయస్ అయ్యర్లు ఒకేసారి ఫీల్డ్లోకి వచ్చేశారు. ఇది ప్రేక్షకులతో పాటు క్రీజ్లో ఉన్న విరాట్ కోహ్లిని కూడా ఆశ్చర్య పరిచింది. అసలు ధావన్ తర్వాత ఎవరు బ్యాటింగ్ చేయబోతున్నారనే దానిపై సందిగ్థత ఏర్పడింది. టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ చేసిన పొరపాటో, కోహ్లి చేసిన పొరపాటో కానీ ఇద్దరూ ఒకేసారి బ్యాటింగ్ చేయడానికి పోటీ పడటం ఆసక్తిని రేపింది. అసలు నాల్గో స్థానంలో బ్యాటింగ్ అనేది కొంతకాలంగా నిరాశ పరస్తుండగా ఇలా ఒకే సమయంలో ఇద్దరు ఆ స్థానం తనదనే రీతిలో పోటీ పడటం నవ్వులు తెప్పించింది. కాగా, చివరకు శ్రేయస్ను వెనక్కి తగ్గడంతో రిషభ్ పంత్ బ్యాటింగ్ చేపట్టాడు.
ఈ ఘటనపై మ్యాచ్ తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. సమాచారం లోపం ఇలా జరిగిందని వివరణ ఇచ్చుకున్నాడు. ఇది కాస్త నవ్వులు పూయించినా ఎవరు రావాలనే దానిపై సరైన అవగాహన లేకపోవడంతో ఇద్దరూ బ్యాట్ పట్టుకుని బయటకు వచ్చారన్నాడు. 10 ఓవర్ల తర్వాత రెండో వికెట్ పడితే పంత్ను నాల్గో స్థానంలో వెళ్లమని బ్యాటింగ్ కోచ్ చెప్పాడని, అదే సమయంలో 10 ఓవర్లలోపు రెండో వికెట్ పడితే శ్రేయస్ అయ్యర్ను వెళ్లమని చెప్పాడన్నాడన్నాడు. కాకపోతే ఈ విషయం సరిగా అర్ధం చేసుకోలేకపోవడంతో ఇద్దరూ ఒకేసారి ఫీల్డ్లోకి వచ్చారన్నాడు.