హైదరాబాదీల మెట్రోత్సాహం
మెట్రో రైలులో ప్రయాణించేందుకు నగర ప్రజలు ఎంతో ఉత్సాహాం చూపుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి వచ్చిన మెట్రో రైళ్లకు ప్రయాణికుల తాకిడి ఎక్కువైపోయింది. 24 మెట్రో స్టేషన్లలో టిక్కెట్ల కోసం ప్రయాణికులు బారులు తీరారు. దీంతో ఆ స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. పలువురు మెట్రో స్మార్ట్ కార్డ్స్ను కొనుగోలు చేస్తున్నారు. మెట్రో ప్రయాణంతో సమయం ఆదా అవుతుందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. మెట్రో ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉందని నగర ప్రజలు చెబుతున్నారు.
మెట్రో జర్నీ సేఫ్ అండ్ స్పీడ్ అని హైదరాబాదీలు అంటున్నారు. ఉప్పల్ నుంచి మియాపూర్ కు రెండు, మూడు గంటల పాటు కొనసాగే జర్నీ.. మెట్రో ద్వారా నిమిషాల్లో పూర్తవుతుందని పేర్కొంటున్నారు. తొలి రోజు కాబట్టి మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉంది. ఈ రాత్రి వరకు సుమారు ఒక లకకు పైగానే ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. తొలిసారిగా మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో మెట్రోలో ప్రయాణించేందుకు నగర ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నెల రోజుల పాటు ఇదే సందడి ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఇక మెట్రో స్టేషన్లలో మీడియా సందడి చేస్తుంది. మెట్రో రైలు ప్రయాణంపై ప్రయాణికుల అనుభూతిని మీడియా ప్రతినిధులు అడిగి తెలుసుకుంటున్నారు. ఎలక్ర్టానిక్ మీడియా ఉదయం నుంచి మెట్రో స్టేషన్లు, రైళ్ల నుంచి లైవ్ ప్రసారాలను అందజేస్తుంది. మెట్రో రైలుపై ప్రయాణికుల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ట్రాఫిక్ కష్టాలకు నేటితో విముక్తి కలిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.