జబర్దస్త్ షోపై పిటిషన్: హైకోర్టుకెక్కిన నాగబాబు, రోజా, రష్మి, అనసూయ
హైదరాబాద్: జబర్దస్త్ షోకు వ్యతిరేకంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఫస్ట్ క్లాస్ అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలైన పిటిషన్ను కొట్టేయాలని కోరుతూ సినీ నటులు నాగబాబు, రోజా, యాంకర్లు రష్మీ, అనుసూయ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక టీవీ చానల్లో జబర్దస్తీ ఖతర్నాక్ కామెడీ పేరిట ప్రసారమవుతున్న షోను ఉద్దేశించి దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారించింది. కోర్టులు, న్యాయవాదులను కించపరిచేవిధంగా టీవీ షోలు ఉండరాదని, ఈ ప్రదర్శనల వల్ల న్యాయ వ్యవస్థల ప్రతిష్ఠ దెబ్బతింటుందని, ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా టీవీ చానళ్లు కొన్ని మార్గదర్శకాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు ఈ సందర్భంగా చెప్పింది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఫస్ట్క్లాస్ అదసనపు మెజిస్ట్రేట్ కోర్టులో ఈ షోలో న్యాయవ్యవస్థను అపహాస్యం చేసే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ వై అరుణ్కుమార్ అనే న్యాయవాది క్రిమినల్ కేసు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను కొట్టివేయాలని కోరుతూ ఆ షోను నిర్వహిస్తున్న సినీనటుడు నాగబాబు, వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న సినీ నటి కె రోజా, ఇంకా ఈ షోలో ఉన్న యాంకర్లు అనసూయ, రష్మీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి విచారించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు పిటిషనర్ల అభ్యర్థన మేరకు న్యాయవాది దాఖలు చేసిన క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొట్టివేశారు. కాని ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. షోలో న్యాయమూర్తులు, న్యాయవాదులను కించపరిస్తే ప్రజలు, కోర్టులకు వచ్చే వారి దృష్టిలో నమ్మకం సడలుతుందని ్న్నారు. కోర్టుల గౌరవం, హుందాతనం దెబ్బతింటుందని, న్యాయవాదుల పరువుకు భంగం కలుగుతుందని హైకోర్టు అభిప్రాయపడింది.