హడలెత్తిస్తున్నా పెట్రోల్ ధరలు…
పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయన్న వార్తలు నిజమే అవుతున్నాయి. ఇప్పటికే గత వారం రోజుల నుంచి పెట్రోల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్క తీరు ధరలతో వాహనదారులు హడలెత్తిపోతున్నారు. మధ్యప్రదేశ్లో పెరిగిన పెట్రోల్ ధర చూసిన వాహనదారులు పెట్రోలు కొనాలంటేనే భయపడిపోతున్నారు. చెప్పాలంటే మధ్యప్రదేశ్లో పెరిగిన పెట్రోల్ ధరలు.. దేశంలో ఎక్కడా కూడా ఈ స్థాయిలో పెరగలేదు. పెంచిన వ్యాట్ తో పెట్రోల్ ధర లీటర్కు ఏకంగా రూ.10 పెరిగింది. అకస్మాత్తుగా ధరలు పెరగడంతో సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. పెట్రో ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు ఇలా చేస్తున్నారంటూ కమల్ నాథ్ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. అయితే వ్యాట్ పెంపుదలపై ప్రభుత్వం వివరణ ఇస్తూ.. వరదల కారణంగానే పన్నును పెంచాల్సి వచ్చిందని, ఇది తాత్కాలికమేనని ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఏదేమైనా.. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెట్రో ధరలు నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి.