నా రెండో కోణాన్ని చూపిస్తానంటున్న మోడీ

‘‘పార్టీ విజయం కోసం నేను పని చేస్తాను..మీరూ పనిచేయండి. నేను కూర్చోను.. మిమ్మల్ని కూర్చోనివ్వను’’ఇది ప్రధానమంత్రి నరేంద్రమోడీ తేల్చి చెప్పిన మాటలు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రెండింట ఘన విజయాన్ని నమోదు చేసి – మరో రెండింట ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొదటిసారి జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోడీ ఈ మేరకు తన తీరును కరాఖండిగా చెప్పారు. ఈ కామెంట్లు 2019 సార్వత్రిక ఎన్నికలపై భారతీయ జనతాపార్టీ ఇప్పట్నుంచే దృష్టి పెట్టిందనే విషయాన్ని తేల్చిచెప్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని 2019 ఎన్నికలకు పార్టీ ఏ విధంగా సమాయత్తం కావటమన్న రీతిలోనే మోడీ నిర్వహించడం గమనార్హం!

అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించినందుకు మోడీని అభినందిస్తూ కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏకవాక్య తీర్మానాన్ని ప్రతిపాదించగా ఆర్థికమంత్రి జైట్లీ దాన్ని సమర్థించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ  దేశంలో యువతీ యువకులు న్యూస్ పేపర్లు – చానళ్ల కంటే మొబైల్ ఫోన్ లపైనే ఎక్కువగా ఆధారపడ్డారని వారికి పార్టీ చేరువ అయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు యువతనే రాయబారులుగా వినియోగించుకోవాలని మోడీ సూచించారు. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి దగ్గరి నుంచి 35 ఏళ్ల యువత దాకా పార్టీ నేతలు కలుసుకోవాలన్నారు. ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వారం రోజుల్లో డిజిటల్ లావాదేవీల కోసం ఉద్దేశించి ప్రారంభించిన ‘భీమ్’ మొబైల్ యాప్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని మోడీ పార్టీ నేతలను కోరారు. అంతేకాకుండా అంబేద్కర్ చేసిన సేవలను ప్రచారంలోకి తీసుకురావాలన్నారు. ఏప్రిల్ 6న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నాడు పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా స్వచ్ఛ్ భారత్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

కాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పట్ల విశ్వాసం ప్రకటించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశం తీర్మానం చేసింది. ఉత్తరప్రదేశ్లో దళితులు – ముస్లింలు సైతం బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టన నేపథ్యంలో ఆయా వర్గాలకు దేశవ్యాప్తంగా మరింత చేరువ కావటానికి కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు పార్టీ ముందున్న పెద్ద సవాలని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలు కులానికి – కుటుంబ పాలనకు – అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని అమిత్ షా పేర్కొన్నారు. మోడీ పరిపాలనకు ప్రజలు మరోసారి ఆమోద ముద్ర వేశారన్నారు. ఇక పార్టీ నేతలు గ్రామస్థాయి నుంచి రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పెద్ద నోట్ల రద్దు అన్నది మోడీ సర్కారు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. కొత్తగా అధికారం వచ్చిన రాష్ట్రాల్లో బిజెపి సుపరిపాలనను అందిస్తుందని ఆయన అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *