ఆఫర్ల మహిమ..సంచలన విక్రయాలు

కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి దివాళి చాలా ముందుగానే వచ్చింది. జూలై 1 నుంచి కొత్త పన్ను విధానం జీఎస్టీ అమలుకాబోతుండటంతో ఆఫర్ల మీద ఆఫర్లు గుప్పించి, వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో కంపెనీలు భారీగా విక్రయాలు నమోదుచేసినట్టు తెలిసింది. గతేడాది పీక్ ఫెస్టివల్ సీజన్ లో అమ్మిన మాదిరిగా ఈ జూన్ నెలలో అధికమొత్తంలో టెలివిజన్లను, రిఫ్రిజిరేటర్లను, ఎయిర్-కండీషనర్లను అమ్మినట్టు కంపెనీలు ప్రకటించాయి. డ్యూరెబుల్ సేల్స్ ఈ నెలలో 85-90 శాతం పెరిగినట్టు కంపెనీలు తెలిపాయి. దీనికి గల ప్రధాన కారణం జీఎస్టీ అమలు కాబోతుండటంతో తాము ఆఫర్ చేసిన పెద్ద మొత్తంలో డిస్కౌంట్లేనని కంపెనీలు ప్రకటించాయి. కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తుండటంతో తమ పాత స్టాక్ ను అమ్ముకోవడానికి కంపెనీలు ఈ ఆఫర్లను తీసుకొచ్చాయి. దీంతో 20-45 శాతం ఇన్వెంటరీని ఖాళీ చేసుకున్నాయి.
అతిపెద్ద విక్రయ చైన్ లు రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, వివేక్స్, గ్రేట్ ఈస్టరన్, కోహినూర్ లు ఇప్పటికే తమ స్టాక్ నంతా అమ్మేసుకున్నట్టు తెలిసింది.  ఈ నెలలో ఈ సంస్థల విక్రయాలు రెండింతలు నమోదైనట్టు వెల్లడైంది. భారీ మొత్తంలో డిస్కౌంట్లు తమ ఆదాయాలు కొంత మాత్రమే ప్రభావం చూపుతాయని ఈ విక్రయ చైన్స్ చెబుతున్నాయి. సాధారణంగా జూన్ నెలలో విక్రయాలు పడిపోతాయని, కానీ ఈ సారి గతేడాది కంటే భారీ మొత్తంలో 80-90 శాతం విక్రయాలు నమోదైనట్టు రిలయన్స్ రిటైల్ డిజిటల్ ఫార్మాట్స్ చీఫ్  ఎగ్జిక్యూటివ్ బ్రియన్ బాడే చెప్పారు.
అంతేకాక ముంబైకు చెందిన విజయ్ సేల్స్, కోహినూర్ విక్రయాలు కూడా 50 శాతం నుంచి 100 శాతం పైకి ఎగిసినట్టు వెల్లడైంది. గ్రేట్ ఈస్టరన్ అయితే ఏకంగా 120 శాతం వృద్ధిని నమోదుచేసినట్టు తెలిసింది. ఎక్కువగా ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు అమ్ముడుపోయినట్టు రిటైలర్లు తెలిపారు. టెలివిజన్లకు 42-43 అంగుళాల, 55 అంగుళాల మోడళ్లకు డిమాండ్ ఎక్కువగా వచ్చినట్టు పేర్కొన్నారు. ఓపెన్ బాక్స్ స్టాక్(డిస్ ప్లేలో ఉంచిన స్టాక్)పై 40-45 శాతం గరిష్ట డిస్కౌంట్లను ఈ రిటైలర్లు ఆఫర్ చేశాయి. వచ్చే నెల నుంచి కన్జ్యూమర్ డ్యూరెబుల్స్ ధరలు కూడా 3-5 శాతం పెరుగబోతున్నాయి.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *