ప్రపంచ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలుచుకున్న పీవీ సింధు
పీవీ సింధు మరో అద్భుతం చేసింది. ఎప్పట్నుంచో ఊరిస్తున్న ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణ పతకాన్ని ఎట్టకేలకు చేజిక్కించుకుంది. వరుసగా మూడో ఏడాది ఫైనల్లో అడుగుపెట్టిన సింధు బంగారు పతకంతో మురిపించింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన తొలి క్రీడాకారిణిగా భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఐదో సీడ్ సింధు 21-7, 21-7తో మూడో సీడ్ నొజొమి ఒకుహర (జపాన్)ను చిత్తుచేసింది. కేవలం 37 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించి.. 2017 ప్రపంచ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రపంచ ఛాంపియన్షిప్లో ఒక స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలతో ఒలింపిక్ మాజీ ఛాంపియన్ జాంగ్ నింగ్ (చైనా) రికార్డును సమం చేసింది. 16 నిమిషాల్లో ముగిసిన తొలి గేమ్లో వరుసగా 7 పాయింట్లతో 8-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది 21-7తో తొలి గేమ్ను పూర్తి చేసింది. రెండో గేమ్ కూడా తొలి గేమ్ మాదిరే సాగింది. రెండో గేమ్ విజయంతో మ్యాచ్ ని సొంతం చేసుకుంది. ఈ విజయం పట్ల ప్రముఖులు సింధుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.