2000 నోటు.. మరో సంచలన కథనం

కొత్తగా వచ్చిన 2 వేల రూపాయల నోటులో నానో చిప్ ఉందట.. నోట్లు ఎక్కడ దాచి పెట్టినా.. ఆ చిప్ ఆధారంగా ప్రభుత్వానికి గుట్టు తెలిసిపోతుందట. శాటిలైట్ ద్వారా ఈ నోట్లకు సిగ్నల్స్ అందుతాయట.. ఆ చిప్ ను డీయాక్టివ్ చేస్తే నోటు పనికి రాకుండా పోతుందట.. ఇలా కొత్త నోట్ల గురించి భలే కథలు వినిపించాయి మొదట్లో. ఐతే ఇదంతా ఉత్తుత్తి ప్రచారమే అని తర్వాత తేలింది. కొత్త 2 వేల నోట్లను మామూలు సాంకేతికతతోనే రూపొందించామని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ఇందులో చిప్పులేమీ లేవని స్పష్టం చేసింది. దీంతో ఈ నోటు గురించి జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.

ఐతే 2 వేల నోటు గురించి ఇప్పుడు కొత్త కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నోటులో పి-32 అనే రేడియో ధార్మిక ఫాస్పరస్ ఐసోటోప్ ఉందన్న వార్త గుప్పుమంది. 2 వేల రూపాయల నోటును ముద్రించేందుకు ఈ రేడియో ధార్మిక పదార్థాన్నే వినియోగించారని.. అందుకే పెద్ద మొత్తంలో దాచిపెట్టిన కొత్త నోట్లు దొరికిపోతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఢిల్లీ.. చెన్నై.. బెంగళూరు సహా పలు నగరాల్లో ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహించి.. నోట్ల కట్టల్ని సులువుగా పసిగట్టేయడానికి ఈ రేడియో ధార్మిక పదార్థమే కారణమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకేచోట పి-32 రేడియో ధార్మిక పదార్థం ఎక్కువ స్థాయిలో ఉంటే సులువుగా తెలిసిపోతుంది.. అందుకే నోట్లు దాచిన చోట సోదాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ రేడియో ధార్మిక పదార్థం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఉండదంటున్నారు. మరి ఈ రేడియో ధార్మిక పదార్థం గురించి వస్తున్న వార్తలపై రిజర్వ్ బ్యాంకు కానీ.. ఆర్థిక శాఖ కానీ ఎలా స్పందిస్తాయో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *