ఇంటి వద్ద దింపుతామంటూ క్యాబ్లో టెక్కీపై రేప్యత్నం
హైదరాబాద్: నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ఒంటరిగా వేచివున్న మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ని ఇంటివద్ద చేరుస్తామంటూ ఇద్దరు యువకులు నమ్మించారు. క్యాబ్ ఎక్కించుకుని 45 కి.మీ ప్రయాణించాక కదులుతున్న కారులోనే ఆమెపై అత్యాచార యత్నానికి ఒడిగట్టారు. ఎల్బీనగర్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ చౌరస్తాలో బుధవారం అర్ధరాత్రి దాటాక 2.30గంటలకు ఓ యువతి విజయవాడ వెళ్లేందుకు జాతీయ రహదారిపై వేచివుంది. అక్కడే ఉన్న నలుగురు యువకుల్లో ఇద్దరు ఆమెపై కన్నేశారు. తమ స్నేహితుడైన క్యాబ్డ్రైవర్ వద్ద వాహనాన్ని తీసుకుని ఆమె ముందు ఆపి ఎక్కడికెళ్లాలని అడిగారు. దీంతో ఆమె విజయవాడ అని తెలిపింది.
కాగా, విజయవాడ వరకూ దింపుతామంటూ కారులో ఎక్కించుకున్నారు యువకులు. చౌటుప్పల్ పంతంగి టోల్గేట్ దాటాక ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నం చేశారు. ఆమె అరుపులు విని అక్కడి స్థానికులు కారును ఆపేందుకు యత్నించగా, యువతిని అక్కడే వదిలేసి.. యువకులు కారుతో సహా పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో నిర్భయకేసు నమోదైంది.
ఆ తర్వాత కేసు ఎల్బీనగర్ పీఎస్కు కేసు బదిలీ చేశారు. ఈ కేసును ఛేదించేందుకు విచారణను ఉన్నతాధికారులు రాచకొండ ఎస్వోటీ బృందానికి అప్పగించారు. ఇన్స్పెక్టర్ నర్సింగరావు పర్యవేక్షణలో ఎస్సైలు కాశీవిశ్వనాథ్, ఆంజనేయులు ఆధ్వర్యంలోని 3 బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్యాబ్ని కనిపెట్టారు. మౌలాలికి చెందిన సదరు యువకులను అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్ పీఎస్కు తరలించారు.