టీమిండియా ప్రధాన కోచ్గా మళ్ళీ రవిశాస్త్రి ఎంపిక
అంచనాలకు తగ్గట్లే భారత జాతీయ పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా రవిశాస్త్రి ఎంపిక అయ్యారు. బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఐదుగురిని ఇంటర్వ్యూ చేసి.. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రీనే తిరిగి ఎంపిక చేశారు. కపిల్దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిల కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. తాము ప్రామాణికంగా నిర్దేశించుకున్న శిక్షణా రీతులు, అనుభవం, సాధించిన ఘనతలు, సమాచారం వినియమం, ఆధునిక శిక్షణా పరిజ్ఞానం అనే ఐదు అంశాలకు శాస్త్రినే తగినవాడంటూ ఆ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పదవికి దరఖాస్తు చేసిన న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెసన్, శ్రీలంకకు కోచ్గా పనిచేసిన టామ్ మూడీ 2, 3 స్థానాలతో సరిపెట్టుకున్నారు. 2007 బంగ్లాదేశ్ పర్యటనలో జట్టు మేనేజర్గా వ్యవహరించిన రవిశాస్త్రి.. 2014-2016 మధ్య కాలంలో జట్టు డైరెక్టర్గా వ్యవహరించాడు. ఇక 2017 నుంచి ఇటీవల పూర్తైన ప్రపంచకప్ వరకు టీమ్ఇండియా కోచ్గా వ్యవహరించాడు.దీంతో శాస్త్రి నాలుగోసారి టీమ్ఇండియా కోచ్గా బాధ్యతలు చేపట్టారు. కానీ టీమ్ఇండియా కోచ్గా రవిశాస్త్రిని తిరిగి ఎంపిక చేయడంపై క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.