టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?
మల్కాజ్గిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటు మంగళవారం (సెప్టెంబర్ 3) మధ్యాహ్నం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారనే వార్తల నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.
పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిసినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోని పార్టీ వ్యవహారాలపై ఆమెతో చర్చించినట్టు వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారనే అంశంపై ఆయన స్పందించాల్సి ఉంది. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటికే పలువురు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగాలని తెలంగాణ కాంగ్రెస్కు చెందిన పలువురు నేతలు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీపీసీసీ అగ్ర నేతల తీరు వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఘోర వైఫల్యం చెందిందని ఆరోపిస్తున్నారు.