చంద్రబాబుపై రేవంత్ కోపం వెనుక కథేంటి?
టీడీపీ అధినేత చంద్రబాబుపై రేవంత్ కోపమొచ్చిందా? కారాలు మిరియాలు నూరుతున్నారా? బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చంద్రబాబు సాఫ్ట్ కార్నర్లోనే బీజేపీని ఎదుర్కుందామని క్లాస్ ఇచ్చినా… కమిట్ అవ్వకుండా ఎందుకు కమలాన్ని కామెంట్ చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా జనసేన అధినేత పవన్ వినిపిస్తున్న ఉత్తరాది అహంకారం నినాదానికి రేవంత్ మద్దతు ఇవ్వడం సరికొత్త చర్చకు తావిస్తోంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కూడా బీజేపీ అమలు చేయడం లేదని.. తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని రేవంత్ విమర్శలు గుప్పించారు. మిత్రపక్షంగా ఉన్న బీజేపీని ఎందుకు టార్గెట్ చేశారు. ఇదే ఇప్పుడు రాజకీయాల్లో హాట్టాపిక్ అయింది.
అధినేత చంద్రబాబుకు, బీజేపికి మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. రెండుపార్టీల పొత్తు ఏపీకే పరిమితమని.. తెలంగాణలో ఎవరి దారి వారిదే అని పరస్పర అంగీకారానికి వచ్చేశారట. ఈ విషయం రేవంత్రెడ్డికి చెప్పకుండానే చంద్రబాబు తన కోటరీలోని ఓ కేంద్ర మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన మరో మంత్రి చర్చల ద్వారా నడిపించారట. అందుకే అమిత్షా కూడా ఏపీలో మాత్రమే పొత్తులు ఉన్నాయని స్పష్టం చేశారు. తెలంగాణపై మాట దాటవేశారు. ఈ వ్యవహారం అమిత్ షా టూర్కు ఒకరోజు ముందే తెలిసిన రేవంత్రెడ్డి అన్ని మీడియాలను పిలిచి బీజేపీతో దాదాపు తెగతెంపులే అని ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. సాయంత్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అదే చెప్పారు. ఇంత కష్టపడుతున్నా తనకు తెలీయకుండానే చంద్రబాబు పొత్తులపై తీసుకున్న నిర్ణయంపై రేవంత్ ఆగ్రహంగా ఉన్నారట. మరి రేవంత్ ఏం చేస్తారో చూడాలి. అధినేతపై తెగ గుస్సా అవుతున్నారట. కనీసం మాట మాత్రం అయినా చెబితే బాగుండేదని అంటున్నారు.